అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : మెటీరియల్ కాంపొనెంట్ నిధుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని రాష్ట్ర ఎంప్లాయ్గ్యారెంటీ పథకం అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ హెచ్చరించారు. బుధవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన జిల్లా పరిషత్ కార్యాలయంలో డ్వామా అధికారులతో, ఎంపీడీవో, క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.89 కోట్లతో మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలన్నారు.
ఈ నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు ఖర్చు పెట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.70 కోట్లతో పనులు చేపట్టారన్నారు. ఫిబ్రవరి 20వ తేదీలోపు వివిధ పనులకు సంబంధించిన బిల్లులను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. మార్చి 31 లోపు మిగిలిన అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నిధులతో పాటు జిల్లాకు అవసరమైన రూ.20 కోట్లు అదనంగా మంజూరు చేస్తామన్నారు. పలమనేరు నియోజకవర్గంలో రూ.84 లక్షలు ఖర్చు చేశారని, క్షేత్ర స్థాయిలో ఏ పనులు చేపట్టలేకపోతున్నారో వివరంగా డ్వామా పీడీకి తెలియజేయాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీ పథకం పేరును వీబీ గ్రామ్జీగా మారుస్తారన్నారు. ఈ సమీక్షలో డ్వామా పీడీ రవికుమార్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


