కోరలు చాచిన ముఠా!
గత డిసెంబర్లో మూడు ఏనుగులు మృతి
వాటి దంతాలు కోసి వేసిన స్మగ్లర్లు
తమిళనాడులో దంతాలమ్ముతూ పట్టుబడిన ముఠా
అందులో పలమనేరు వాసి హస్తం
విచారిస్తున్న అధికారులు
పలమనేరు: ఏనుగులకు రక్షణ లేకుండా పోతోంది. అడవి దాటితే చాలు స్మగ్లర్లు వేటాడేస్తున్నారు. దంతాలు కోసి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇలాంటిదే ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. ఓ ముఠా ఏనుగు దంతాలను విక్రయిస్తుండగా అక్కడి ఫారెస్ట్ అధికారులు రెండ్రోజుల క్రితం కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో పలమనేరు మండలం, అటవీ సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కీలకంగా ఉన్నట్టు బయటపడింది. తమిళనాడు ఫారెస్ట్ అధికారులు ఇక్కడున్న అటవీశాఖ అధికారుల ద్వారా ఏనుగు దంతాల కేసులో కీలక వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు.
‘మోర్థన’లో ఏం జరిగింది?
తమిళనాడుకు ఆనుకుని ఉన్న మోర్థాన ఫారెస్ట్లో గతేదాడి డిసెంబర్ 4న పేర్నాంబట్, అరట్ల, చెత్తపెంట గ్రామాలకు సమీపంలోని కొండపల్లి కుంట వద్ద ఓ మదపుటేనుగు, ఆడ ఏనుగు, ఓ పిల్ల ఏనుగులకు చెందిన కుళ్లిన మృతదేహాలను గుడియాత్తం ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వారు పరిశీలించగా మూడు వారాల క్రితం అవి మృతి చెందినట్టు అర్థమైంది. ఈ ఏనుగులు పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో జూ అధికారులు అక్కడే పోస్ట్మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మగ ఏనుగుకు దంతాలు కోసివేసినట్టు గుర్తించారు. ఇది వేటగాళ్ల పనేనని భావించి.. అప్పటి నుంచి దీనిపై విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగు దంతాలను విక్రయిస్తుండగా ఓ ముఠాను తమిళనాడు ఫారెస్ట్ అధికారులు పట్టుకొని విచారిస్తున్నారు.
గతంలోనూ..
గతంలోనూ గుడిపాల మండలంలో ఏనుగు దంతాలను విక్రయించే కొందరిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా ఇప్పుడు పలమనేరు అటవీ ప్రాంత వాసి పేరు వెలుగులోకి రావడంతో తమిళనాడు ఫారెస్ట్ అధికారులతో కలసి ఇక్కడి అధికారులు నిందితుడ్ని పట్టుకొనే పనిలోపడ్డారు.
అది నిజమే!
ఈ ఘటన తమిళనాడులోని మోర్థాన ఫారెస్ట్లో జరిగింది. ఏనుగు దంతాల కేసులో ఇక్కడి వ్యక్తి ప్రమేయం ఉండడంతో అక్కడి ఫారెస్ట్ అధికారులకు సాయం చేస్తున్న మాట నిజమే.
– సుబ్బరాజు, చిత్తూరు డీఎఫ్వో


