కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా ముస్తాబుచేశారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు, జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో క్యూలన్నీ నిండి కిటకిటలాడాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. భక్తులకు ఉచిత తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


