
ఆ హత్యలే పరువు తీస్తున్నాయ్..!
● కులాంతర ప్రేమ వివాహాలు జీర్ణించుకోలేని పెద్దలు ● క్షణికావేశంలో కన్నపిల్లల్ని కడతేర్చుతున్న పోకడ ● ప్రాణం తీశాక జైల్లో ఊచలు.. రోడ్డున కుటుంబం ● పరువు హత్యల్లో మారాల్సింది పెద్దల ఆలోచనలు
ఈ రెండు ఘటనల్లోనూ కనిపిస్తున్న సాధారణ అంశం.. కులాంతర వివాహాలు. వీటి నుంచి తమ పెద్దరికాన్ని కాపాడుకోవడానికి కన్న వాళ్లే ప్రాణాలు తీసే యముళ్లుగా మారుతున్నారు. పరువు హత్యలకు పూనుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నందకు కన్న కూతుర్ని హత్య చేయడంతో పోయిన పరువు తిరిగి వచ్చిందా..? అసలు కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోయిందా..? అసలు పరువు అనే పదానికి ఈ తరంలో చోటు ఉందా..? పరువు హత్యలతో జైలు జీవితం కాకుండా, సాధించింది ఏమైనా ఉందా..? అని ప్రశ్నించుకుంటే అసలు పరువు హత్యల జోలికి ఏ ఒక్కరూ వెళ్లరు.
● ‘‘ పలమనేరులోని ఊసరపెంటకు చెందిన భాస్కరనాయుడు కుమార్తె హేమావతి అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు కేశవను ప్రేమించింది. పెళ్లికి యువతి తరఫున అంగీకరించకపోవడంతో వాళ్లను కాదని వివాహం చేసుకున్నారు. తిరుపతిలో కాపురం పెట్టారు. ఏడాది తరువాత హేమావతి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు అనంతరం భార్య, బిడ్డను ఇంటికి తీసుకెళుతుండగా భర్త ఎదుటే భాస్కర నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హేమావతి మెడకు తాడు బిగించి కన్న కూతుర్ని కడ తేర్చాడు.’’ – 2019, జూన్
● ‘‘యాస్మిన్ భాను. ఎంబీఏ పూర్తి చేసి, సాయితేజ అనే దళిత యువకుడిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లాడింది. సరిగ్గా రెండు నెలల తరువాత తండ్రి డిప్రెషన్లో ఉన్నాడని, చూసి వెళ్లాలని ఫోన్ రావడంతో చిత్తూరులోని బాలాజీ కాలనీకి బయలుదేరింది. కారులో ఎక్కించుకున్న తండ్రి షౌకత్ అలీ, మరో ఇద్దరు బంధువులు.. తాము సూచించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. యాస్మిన్ ఒప్పుకోకపోవడంతో, ఆమె కాళ్లను తొక్కిపెట్టిన తండ్రి ఓ తాడుతో మెడకు రెండు చుట్లు వేసి హత్య చేసి.. కర్కశంగా కన్నపేగును తెంచేశాడు.’’ – పది రోజుల క్రితం
చిత్తూరు అర్బన్: ప్రస్తుతం నడుస్తున్నది ఏఐ (ఆర్టిఫి షియల్ ఇంటలిజెన్స్)తో కూడుకున్న ఆధునిక సమాజం. ఇక్కడ ఎవరి గురించి, ఎవరూ పట్టించుకునేంత సమయం లేదు. అది పట్టణమైనా, పల్లెటూరైనా సరే. ఈ ఆధునికీకరణ సమాజంలో అసలు పరువు అనే పదానికి చోటే లేదు. పక్కవాడు మన గురించి ఏమనుకుంటాడో..? 24 గంటలు మనల్ని నిశితంగా పరిశీలిస్తూ, మనం చేసే పనులకు మార్కులు వేస్తాడా..? అనే ప్రశ్నలకు ఇక్కడ తావులేదు. ఇక్కడ ఎవరి పనులు వాళ్లవి. కాలంతోపాటు పరుగెత్తుతున్న మనుషులు పరువు గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు.
ఆలోచనలు మారాలి..
మొన్న భాస్కర నాయుడు, నిన్న షౌకత్ అలీ.. పేర్లు ఏవైనా వీలిద్దరూ తమ పిల్లల్ని చంపేసిన తండ్రులుగా సమాజంలో నిలిచిపోయారు. పైగా పలమనేరు, చిత్తూరులో జరిగిన పరువు హత్యల అనంతరం, వాటిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయ త్నం చేసి పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసులు కోర్టులో రుజువైతే జీవిత ఖైదు నుంచి ఉరిశిక్ష వరకు శిక్ష పడే అవకాశం ఉంది. చిత్తూరులో యాస్మిన్ను హత్య చేశాడనే ఆధారాలు సేకరించిన పోలీసులు షౌకత్అలీని జైలుకు తరలించారు. ఇప్పుడు అతని భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. అసలు ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే ఆర్థిక, సామాజిక పరమైన ఇబ్బందులను తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి. అప్పటికే ప్రేమ వివాహంపైనే ఆసక్తి ఉంటే.. సమాజంలో ఎలా ధైర్యంగా నిలబడాలో పిల్లలకు నేర్పించాలి. అంతేతప్ప, పిల్లల ప్రాణాలు తీసే అధికారం తమకు లేదనే నిజాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలు సైతం తాము మేజర్లు, తమ ఇష్టం వచ్చినవారిని పెళ్లాడుతామని కాకుండా.. తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసు కుని వారి అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రేమ పెళ్లి చేసుకున్నా జీవితంలో సంతోషంగా ఉంటామనే ధైర్యాన్ని ఇవ్వాలి. రెండు వైపులా ఆలోచనా విధానాలు మారితే తప్ప.. పరువు హత్యలనే పదం మాసిపోదు.

ఆ హత్యలే పరువు తీస్తున్నాయ్..!

ఆ హత్యలే పరువు తీస్తున్నాయ్..!