
ఒకే ఈతలో 4 పిల్లలు
బైరెడ్డిపల్లె: మండలంలోని కుప్పనపల్లె గ్రామానికి చెందిన నాగరాజు మేకలను పెంచుతూ జీవిస్తున్నాడు. తన మేకల మందను శనివారం మేత కోసం గ్రామ సమీపంలోకి తీసుకెళ్లగా మందలోని ఓ మేక 4 పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా మేకలు ఒకటి, రెండు పిల్లలను మాత్రమే వేస్తాయని, 4 పిల్లలు ఒకే కాన్పులో వేయడంతో రైతు నాగరాజు ఆనంద పడ్డాడు.
కారు ఢీకొని
వ్యక్తికి తీవ్రగాయాలు
పుంగనూరు: మండలంలోని రాంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. మోటారుసైకిల్పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. దీనిని గమనించిన ఆప్రాంత వాసులు 108లో బాధితుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
వెదురుకుప్పం: మండలంలోని మారేపల్లె సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెదురుకుప్పం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 35–40 సంవత్సరాల మధ్యలో ఉంటుందని 5 అడుగుల 5 అంగుళాల పొడవు ఉన్నట్లు చెప్పారు. తను వేసుకున్న పింక్ కలర్ షర్ట్తో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతుడి ఎడమ చేతిపై షీలా అని ఆంగ్లంలో పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. కాగా మృతుడి వివరాలు తెలిస్తే 9440900691 నంబర్కు తెలియజేయాలని కోరారు.

ఒకే ఈతలో 4 పిల్లలు