
స్వర్ణరథంపై వరసిద్ధుడి అభయం
● ఘనంగా సంకటహర చతుర్థి పూజలు
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో బుధవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చతుర్థి సందర్భంగా అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతంను చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వ్రతంను ఆచరించారు. కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మాడ వీధుల్లో ఊరేగింపు
స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి రాత్రి ఆలయ మాడ వీధులలో స్వర్ణ రథంపై విహరించారు. ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారి స్వర్ణ రథంలో కొలువు దీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం స్వర్ణ రథం ఆలయ మాడ వీధులలో అభయమిస్తూ ఊరేగారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

స్వర్ణరథంపై వరసిద్ధుడి అభయం