![షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/24ctr508-300007_mr.jpg.webp?itok=paYWHNqn)
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల్లో విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు జారీచేసిన షోకాజ్ నోటీసులను మానవతా దృక్ఫథంతో ఉపసంహరించాలని ఫ్యాప్టో సంఘ నాయకులు గంటామోహన్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘ నాయకులు కలెక్టరేట్లో డీఆర్ఓ పుల్లయను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ఉద్యోగులు అనారోగ్య కారణాలతో విధులకు హాజరుకాలేకపోయారన్నారు. 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల విధులు నిర్వహించినందుకు ఎన్నికల సిబ్బందికి 14వ తేదీ ఆన్డ్యూటీగా పరిగణించి డ్యూటీ సర్టిఫికెట్ జారీచేయాలని కోరారు. వివిధ తనిఖీ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఎంఈఓ, హెచ్ఎంలకు రెమ్యూనరేషన్ చెల్లించాలన్నారు. డీఆర్ఓ స్పందిస్తూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సంఘ నాయకులు మణికంఠ, ముక్తార్ అహ్మద్, కిరణ్కుమార్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.