
పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 2023–24 విద్యా సంవత్సరంలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ పరీక్షలకు రాష్ట్ర విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్ను జారీచేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సప్లిమెంటరీ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చే పట్టారు. గతంలో పదోతరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసినట్లైతే వారి సర్టిఫికెట్లపై సప్లిమెంటరీ అని నమోదయ్యేది. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని ఎత్తివేశారు. గతంలో మాదిరి కాకుండా రెగ్యులర్ విద్యార్థుల్లాగానే వారిని పరిగణించనున్నారు. జిల్లా వ్యాప్తంగా సప్లిమెంటరీ పరీక్షలకు 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనలో నిమగ్నమయ్యారు.
ప్రత్యేక శిక్షణ
పబ్లిక్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు గతేడాది మాదిరిగానే ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షల్లో ఆ విద్యార్థులను ఉత్తీర్ణులు చేసేలా శిక్షణ ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయా సబ్జెక్టులను చెందిన టీచర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సులువుగా ఉత్తీర్ణత చెందేలా మెలకువలను నేర్పిస్తున్నారు. ఇప్పటికే సప్లిమెంటరీ విద్యార్థులకు హాల్టికెట్లను ఆయా పాఠశాలలకు చేరాయి. హెచ్ఎంలు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసి సంతకం చేసి విద్యార్థులకు జారీచేయనున్నారు.
ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో 15 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
పకడ్బందీ ఏర్పాట్లు చేశాం
పది సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. ఈ నెల 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. పరీక్షల నిర్వహణకు 15 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షలను సజావుగా పకడ్బందీగా నిర్వహిస్తాం. పరీక్షలు తప్పిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతోంది.
– దేవరాజు, డీఈఓ, చిత్తూరు
పరీక్షలకు 2006 మంది విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. జిల్లా నుంచి 20,939 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాశారు. వారిలో 19,113 మంది ఉత్తీర్ణత చెందారు. 1826 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. వారితో పాటుగా గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులతో కలిపి మొత్తం 2006 మంది విద్యార్థులు ఈ నెల 24న నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్ల నియామకాలను జిల్లా విద్యాశాఖ అధికారులు చేపడుతున్నారు.

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు