
క్యాంపు పరిశీలనలో తిరుపతి డీఎంఅండ్హెచ్ఓ శ్రీహరి
ఉమ్మడి జిల్లాలో సురక్ష వివరాలు
నిర్వహించాల్సిన వైద్య శిబిరాలు 1035
ఇప్పటివరకు నిర్వహించినవి 1028
గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టినవి 899
పట్టణ ప్రాంతాల్లో నిర్వహించినవి 129
వినియోగించుకున్న వారి సంఖ్య 4,13,875
వీరిలో మహిళలు 2,28,939
వైద్య సేవలు పొందిన పురుషులు 1,84,936
కొత్తగా షుగర్ బాధితుల సంఖ్య 15,203
కొత్తగా చేరిన బీపీ బాధితులు 20,341
నేత్ర సమస్యలున్నవారు 59,623
కళ్లద్దాలు పొందిన వారు 35,615
కంటి శస్త్ర చికిత్స పొందినవారు 269
రక్తహీనత ఉన్నవారు 70,335
క్షయతో బాధపడుతున్న వారు 527
టీబీ పరీక్షలు చేయించుకున్నవారు 13,374
కొత్తగా గుర్తించిన టీబీ బాధితులు 63
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి రెఫర్స్ 6,683
ఆరోగ్య శ్రీ సేవలు పొందినవారు 2,802
చిత్తూరు రూరల్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 15న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. 21,147 మంది వలంటీర్లు, 902 మంది మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, 1,333 మంది ఏఎన్ఎంలు, 3,247 మంది ఆశావర్కర్లు ఇంటింటికి వెళ్లి 29,51,448 మందిని ఆరోగ్య సర్వే చేశారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ను డౌన్లోడ్ చేయించారు. అనుమానిత వ్యక్తులకు బీపీ, మధుమేహం వంటి ఏడు రకాల పరీక్షలను ఇంటి వద్దే చేయించారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి టోకెన్లు ఇచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.
త్వరలో ముగియనున్న క్యాంపు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి వైద్య శిబిరాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుని ముందస్తు ప్రణాళికతో క్యాంపులను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇందుకు 549 మంది స్పెషలిస్టు డాక్టర్లు, 258 మంది మెడికల్ ఆఫీసర్లను కేటాయించారు. వారు గుర్తించిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ శిబిరాలకు జనం ఉదయం 9 గంటల నుంచే క్యూకడుతున్నారు. కార్పొరేట్ తరహాలో రోగుల వివరాలను పొందుపరచడం, వారికి ఫైల్స్ ఇవ్వడంతో పాటు ఉచితంగా చికిత్స చేస్తున్నారు. త్వరలో ఈ శిబిరాలు ముగియనున్నాయి.
పిల్లలకూ ఆరోగ్య సమస్యలు
దంత, చిన్న పిల్లల సమస్యలకూ అధికంగా ఓపీలొచ్చాయి. ఉచితంగా వైద్యం చేసి, మాత్రలు, మందులు పంపిణీ చేశారు. ఇలా సాయంత్రం వరకు హెల్త్ క్యాంపులో డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు చికిత్స అందించడంలో బిజీ బిజీగా కనిపిస్తున్నారు. జనం కూడా ఓపికగా చికిత్స చేయించుకుంటున్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సచివాలయ సిబ్బంది సహకారం అందిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
పిల్లల నుంచి వృద్ధుల వరకు
పిల్లల నుంచి వృద్ధుల వరకు జగనన్న ఆరోగ్య సురక్ష భరోసా ఇస్తోంది. వాడవాడలా ప్రభుత్వం శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం చేయించడంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికంగా గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకున్నారు. కంటి పరీక్షలు చేసి కళ్ల అద్దాలు ఇస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 1,028 వైద్య శిబిరాలు
4,13,875 మందికి వైద్యం
ఉచితంగా పరీక్షలు, మాత్రలు పంపిణీ
వెలుగుచూసిన బీపీ, మధుమేహం కేసులు
పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అది కూడా గడప వద్దకే చేరాలని జగనన్న ప్రభుత్వం నిర్ణయించింది. మారుమూలన ఉన్న గ్రామానికి వైద్యులను పంపించింది. అదే కాకుండా ప్రతి ఇంటింటిని సర్వే చేసి, అనారోగ్య సమస్యలున్న వారికి వెదికి వెదికి వారికి వైద్యం అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా నెలన్నర క్రితం ప్రారంభించిన ఈ వైద్య శిబిరాలకు జనం తాకిడి పుంజుకుంది. ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు చేసి మందులు, మాత్రలు పంపిణీ చేస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది. దీంతో జగన్న ఆరోగ్య సురక్ష పేదలకు కొండంత బలాన్నిస్తోంది.
పేదల ఆరోగ్యమే ధ్యేయం
పేదలకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కొత్త ఆలోచనతో సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పల్లెకు డాక్టరు రావడం ప్రజలు గొప్ప వరంలా భావిస్తున్నారు. ఇందులో కొందరు దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. బీపీ, మధుమేహ పరీక్ష పరికరాలను అందజేశారు. వాటిని ఏఎన్ఎంలకు అందజేశాం. ఇంత మంది క్యాంపును సద్వినియోగం చేసుకుంటున్నారని ఊహించలేదు. ప్రణాళిక ప్రకారం కార్యక్రమం కొనసాగుతోంది. – రవిరాజు,
జిల్లా నోడల్ ఆఫీసర్, జగనన్న ఆరోగ్య సురక్ష
జల్లెడ పట్టారు
జగనన్న ఆరోగ్య సురక్షతో వలంటీర్లు, వైద్య సిబ్బంది సర్వే చేసి అనారోగ్య సమస్యలను జల్లెడ పట్టారు. దీంతో పలు వ్యాధులు బయటపడ్డాయి. ప్రధానంగా బీపీ, మధుమేహం, కంటి సమస్యలు, టీబీ, క్షయ వెలుగులోకి వచ్చాయి. వారంతా కూడా ఇప్పుడు చికిత్స తీసుకునే పనిలో పడ్డారు. సకాలంలో వారి తగిన వైద్యం చేసేందుకు ఈ సురక్ష అండగా నిలిచింది. చిత్తూరు జిల్లాలో రెండు చోట్ల మాత్రమే క్యాంపు నిర్వహించాల్సి ఉంది.
– ప్రభావతిదేవి,
డీఎంహెచ్ఓ, చిత్తూరు జిల్లా
విజయవంతంగా నడిచింది
నెలన్నర రోజుల పాటు జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష తిరుపతి జిల్లాలో ఐదు ప్రాంతాల్లో మాత్రమే జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా సాగింది. వైద్యాధికారులు బాధ్యతగా తీసుకుని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చారు. కొత్తగా మరికొంత మందికి వ్యాధులు బయటపడ్డాయి. వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని వైద్యం చేయించుకోవాలి. నిర్లక్ష్యం వద్దు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులకు ఈ క్యాంపు ఉపయోగకరంగా మారింది.
– శ్రీహరి, డీఎంహెచ్ఓ, తిరుపతి జిల్లా

శిబిరంలో చికిత్స చేస్తున్న వైద్యులు


