న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్బాల్ పాలక సంస్థ ఫిఫాతో ఎనిమిదేళ్ల డీల్ కుదుర్చుకున్న ‘జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్’ (జీఈఈఎల్) క్రీడా ప్రసారాల రంగంలోకి ప్రవేశించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘యునైట్8 స్పోర్ట్స్’ పేరిట క్రీడా ఛానళ్ల పోర్ట్ఫోలియోను ప్రారంభించినట్లు ప్రకటించింది. 2026 ఫిఫా వరల్డ్కప్తో పాటు ఫిఫా టోర్నీలను భారత ప్రేక్షకులకు ప్రసారం చేయనుంది.
దేశవ్యాప్తంగా 500కుపైగా కేబుల్, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫారమ్లలో యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డీ, యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డీ ఛానళ్లు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ నెట్వర్క్లో ఫుట్బాల్తో పాటు క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి క్రీడల ప్రసారాలు ఉంటాయి.
‘‘డిస్ట్రిబ్యూషన్ భాగస్వాముల సహకారంతో వీక్షకులకు అంతరాయం లేని ప్రసారాలు అందించడమే మా లక్ష్యం. రానున్న ఫిఫా ఈవెంట్లను మా ఛానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా క్రీడాభిమానులకు మెరుగైన వీక్షణ అనుభూతిని అందిస్తాం’’ అని యునైట్8 స్పోర్ట్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ భవేష్ జనావ్లేకర్ తెలిపారు.


