న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తమ మల్టీ–కరెన్సీ ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డుల ద్వారా 2,80,000 డాలర్ల (సుమారు రూ. 2.5 కోట్లు) అనధికారిక లావాదేవీలను గుర్తించినట్లు వెల్లడించింది. బుక్మైఫారెక్స్ భాగస్వామ్యంతో జారీ చేసిన 5,000 మంది కస్టమర్లకు చెందిన కార్డుల ద్వారా ఫిబ్రవరి 24 తెల్లవారు ఝామున ఓ లాటిన్ అమెరికా దేశంలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది.
అసాధారణ స్థాయిలో లావాదేవీలు తిరస్కరణకు గురవుతుండటంతో సిస్టం దీన్ని గుర్తించినట్లు పేర్కొంది. సదరు కస్టమర్లు నష్టపోకుండా ఆ మొత్తాన్ని వెనక్కి రప్పించేలా కార్డ్ నెట్వర్క్తో కలిసి పని చేస్తున్నట్లు వివరించింది. పటిష్టమైన నియంత్రణ విధానాల కారణంగా 688 అనధికారిక ప్రయత్నాలను సిస్టం అడ్డుకుందని, దీంతో 1,00,000 డాలర్ల నష్టాన్ని నివారించిందని యస్ బ్యాంక్ తెలిపింది.


