భారత్‌తో వాణిజ్యంపై యూఎస్‌ స్పై చీఫ్‌ స్పందన | US Spy Chief Tulsi Gabbard Confident of Mutually Trade Deal with barath | Sakshi
Sakshi News home page

భారత్‌తో వాణిజ్యంపై యూఎస్‌ స్పై చీఫ్‌ స్పందన

Mar 17 2025 6:16 PM | Updated on Mar 17 2025 6:28 PM

US Spy Chief Tulsi Gabbard Confident of Mutually Trade Deal with barath

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలు విధిస్తూ వివిధ దేశాల వాణిజ్యాలపై ప్రభావితం చూపుతున్న నేపథ్యంలో ఇండియాపై యూఎస్‌ వైఖరి ఎలా ఉంటుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గబ్బార్డ్ తన భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య అత్యున్నత స్థాయిలో జరుగుతున్న నిర్మాణాత్మక చర్చలను ప్రస్తావించారు.

న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ​్‌లో గబ్బార్డ్ మాట్లాడుతూ.. ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఇరువురు నేతలు కట్టుబడి ఉన్నారని నొక్కిచెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చలను భారత అధికారులు వివాద అంశంగా కాకుండా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే అవకాశంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యల పరిష్కారాలకు ఇరు దేశాల నాయకులు ఆచరణాత్మక విధానాలకు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కాసులు కురిపిస్తున్న పసిడి.. ఎనిమిదేళ్లలో 200 శాతం రాబడి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా భారత అధికారులతో గబ్బార్డ్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాణిజ్యానికి అతీతంగా ఇంటెలిజెన్స్ సహకారం, రక్షణ, విద్య వంటి వివిధ రంగాల అభివృద్ధికి చర్చలు సాగాయి. భారత్, అమెరికాల మధ్య అభివృద్ధి చెందుతున్న భాగస్వామ్యంలో గబ్బార్డ్ పర్యటన కీలకంగా మారింది. ఇరు దేశాలకు సమ్మతంగా ఉండే వాణిజ్య ఒప్పందాన్ని సాధించడంలో ఆమె విశ్వాసంగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement