WFH In India: Techies Continue Work From Home, Said Colliers India - Sakshi
Sakshi News home page

Work From Home: ఆఫీస్‌కు రావడంలేదు..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే పరిమితమైన ఐటీ ఉద్యోగులు!

Aug 5 2022 9:29 PM | Updated on Aug 6 2022 9:06 AM

Techies Continue Work From Home Said Colliers India - Sakshi

కోవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గడంతో అత్యధికంగా టెలికం, కన్సల్టింగ్‌ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తిరిగి కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయంలో ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో అత్యధికులు ఇంటి నుంచే పని చేస్తున్నారని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ ఇండియా, కో–వర్కింగ్‌ ఆపరేటర్‌ ఆఫిస్‌ సంయుక్తంగా మే–జూన్‌లో చేపట్టిన సర్వేలో తేలింది. 

సర్వే ప్రకారం.. ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ కేసులు క్షీణించడంతో కార్యాలయాలకు ఉద్యోగుల రాక పెరిగింది. ఫలితంగా 34 శాతం కంపెనీలకు చెందిన ఉద్యోగుల్లో 75–100 శాతం మంది ఆఫీసులకు వచ్చి (హైబ్రిడ్‌తో కలిపి) విధులు నిర్వర్తిస్తున్నారు. 25 శాతం మంది మాత్రమే కార్యాలయానికి వచ్చి పని చేస్తున్నట్టు 41 శాతం కంపెనీలు వెల్లడించాయి. టెలికం, కన్సల్టింగ్‌ రంగాల్లో 75–100 శాతం, ఐటీ, నూతన తరం సాంకేతిక రంగాల్లో 25 శాతం వరకు ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వచ్చి విధులు చేపడుతున్నారు.  

వికేంద్రీకరణ విధానం.. 
హైబ్రిడ్‌ విధానానికి 53 శాతం కంపెనీలు సై అంటున్నాయి. కార్యాలయాల వికేంద్రీకరణ విధానాన్ని స్వీకరించనున్నట్టు 74 శాతం కంపెనీలు వెల్లడించాయి. వికేంద్రీకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్స్‌ సెంటర్లను అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నట్టు 49 శాతం కంపెనీలు తెలిపాయి.పనిచేయడానికి అనువుగా ఉండే ఫ్లెక్సిబుల్‌ స్థలం మెట్రోయేతర నగరాల్లో 2022 డిసెంబర్‌ నాటికి రెండింతలకుపైగా అధికమై 55 లక్షల చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా. వర్క్‌స్పేస్‌ వ్యూహం కింద 77 శాతం కంపెనీలు ఫ్లెక్స్‌ స్పేస్‌ను భాగంగా చేసుకుంటాయని కొలియర్స్, ఆఫిస్‌ వెల్లడించాయి.2022 జనవరి–జూన్‌లో 2.75 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని వివిధ కార్యాలయాలు అద్దెకు తీసుకున్నాయి. గతేడాది జనవరి–జూన్‌లో ఇది 1.03 కోట్ల చదరపు అడుగులు మాత్రమే. ఫ్లెక్సిబుల్‌ వర్క్‌స్పేస్‌ వాటా 13 శాతంగా ఉంది.  

సర్వేలో సీఈవోలతోసహా.. 
ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజనీరింగ్, తయారీ రంగాలకు చెందిన కంపెనీలు సర్వేలో పాలుపంచుకున్నాయి. గరిష్టంగా ఈ కంపెనీల్లో 10,000 వరకు సిబ్బంది ఉన్నారు. సీఈవోలు, సీవోవోల వంటి కీలక వ్యక్తుల నుంచి 150కిపైగా స్పందనల ఆధారంగా నివేదికను విడుదల చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement