టాటా మోటర్స్ లక్ష్యం రూ. 35,000 కోట్ల
పెట్టుబడులకు సిద్ధం చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడి
న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ రంగం 2030 నాటికి ఏటా 60 లక్షల వాహనాల విక్రయాల దిశగా భారీగా వృద్ధిని సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో అందులో దాదాపు 12 లక్షల వాహన విక్రయాలు తమవే ఉండాలని టాటా మోటర్స్ నిర్దేశించుకుంది. తద్వారా 20 శాతం పైగా మార్కెట్ వాటాను దక్కించుకోవాలని టాటా మోటర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గోవాలో జరిగిన టాటా మోటార్స్ డీలర్ల వార్షిక బిజినెస్ ప్లానింగ్ సమావేశం–2026లో టాటా సన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక మైలురాయిని అందుకునేందుకు రూ. 35,000 కోట్ల భారీ మూలధన పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ కట్టుబడి ఉందన్నారు. మార్కెట్ పురోగతిని బట్టి ఈ ప్రణాళికను మరింత విస్తరిస్తామని చెప్పారు.
డీలర్లదే కీలక పాత్ర
టాటా మోటార్స్ భవిష్యత్ విజయం డీలర్ల చేతుల్లోనే ఉందని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ‘‘కంపెనీ తరఫున కొత్త మోడళ్లు, ఆవిష్కరణలను వేగంగా మార్కెట్లోకి తీసుకువస్తాము. అయితే సేల్స్ అనుభవం, సరీ్వస్ నాణ్యత, కస్టమర్ల నమ్మకాన్ని పొందడంలో డీలర్ నెట్వర్క్ బలంగా పనిచేసినప్పుడే అనుకున్న మైలురాళ్లను చేరుకోగలము’’ అని చంద్రశేఖర్ వివరించారు. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు రాణించే సంస్థలే నిజమైన గొప్ప కంపెనీలుగా నిలుస్తాయన్నారు. ఇందుకోసం డీలర్లందరూ సరికొత్త ఆలోచనా దృక్పథంతో ముందుకు సాగాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
అప్పట్లో వ్యాపారం మూసేయమన్నారు ..
గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ‘‘2017లో ప్యాసింజర్ వాహనాల (కార్ల) వ్యాపారం మూసివేసి, కేవలం కమర్షియల్ వాహనాలపైనే దృష్టి పెట్టాలని కంపెనీలో చర్చలు జరిగాయి. కానీ, మనమందరం కలిసి సాధించిన కృషి కారణంగా ఈ రోజు భారతీయ కార్ల మార్కెట్లో టాప్–2 స్థానాల్లో ఒకటిగా గర్వంగా నిలబడ్డాం’’ అని చంద్రశేఖరన్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో కంపెనీ సాధించిన నాయకత్వాన్ని, నిలకడగా మెరుగుపడుతున్న ఆర్థిక పనితీరును ఆయన కొనియాడారు.


