20 శాతం వృద్ధి: టాటా హిటాచీ

Tata Hitachi 20percent growth in revenues this fiscal - Sakshi

కోల్‌కత: నిర్మాణ రంగానికి అవసరమైన యంత్రాల తయారీలో ఉన్న టాటా హిటాచీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2021–22లో కంపెనీ రూ.4,000 కోట్ల టర్నోవర్‌ సాధించింది. అధిక విలువ కలిగిన మైనింగ్‌ యంత్రాలకు డిమాండ్‌ నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం 10–12 శాతం అధికం కానుందని టాటా హిటాచీ ఎండీ సందీప్‌ సింగ్‌ తెలిపారు. ‘మౌలిక రంగం నుంచి డిమాండ్‌ వృద్ధి 12–15 శాతం ఉంది. మైనింగ్‌ విభాగం నుంచి ఇది 20–25 శాతానికి ఎగసింది.

మొత్తం విక్రయాల్లో మైనింగ్‌ విభాగం యూనిట్ల పరంగా 8 శాతం సమకూరుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ సెగ్మెంట్‌ వాటా 15 శాతానికి చేరనుంది. పొరుగు దేశాలు ఆర్థిక కారణాల వల్ల దిగుమతులను తగ్గించిన తర్వాత మధ్యప్రాచ్య, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఎగుమతులు పెరగడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఎగుమతులు ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఏడు శాతం వాటాను కలిగి ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఎగుమతుల వాటా 10 శాతానికి చేరాల్సి ఉంది’ అని వివరించారు. జేవీలో హిటాచీకి 60 శాతం, టాటా కంపెనీకి 40 శాతం వాటా ఉంది. కర్నాటకలోని ధార్వాడ్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top