ఎంత మంచివాడవయ్యా! ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్గా ఎలక్ట్రిక్ స్కూటర్లు
దీపావళి పండగ అంటేనే సంతోషం, ఆనందం. దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు దీపావళికి ఉద్యోగులకు బోనస్లు ఇస్తుంటాయి. ఇతరత్రా గిఫ్టులు అందచేస్తాయి. కానీ సూరత్కి చెందిన ఈ కంపెనీ యజమాని ఔరా అనిపించే పని చేశాడు.
సూరత్లో
సూరత్కి చెందిన అలియన్స్ సంస్థ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. కంపెనీ ఎదుగుదలతో తోడ్పాటు అందించిన ఉద్యోగులకు ఏదైనా చేయాలని ఆ కంపెనీ యజమాని తలిచాడు. దీపావళి పండుగని అందుకు తగిన సందర్భంగా ఎంచుకున్నాడు.
రూ.76,848
తమ ఆఫీసుకు వచ్చి పోయే ఉద్యోగులకు సౌకర్యంగా ఉండటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఒక్కో ఉద్యోగికి ఓకినావా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ని పండగ గిఫ్ట్గా అందించాడు. ఒక్క స్కూటర్ ఎక్స్షోరూం ధర రూ.76,848లుగా ఉంది. మొత్తం సంస్థలో ఉన్న ముప్రై ఐదు మందికి ఈ స్కూటర్లను అందించాడు.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే
2 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఓకినావా స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 88 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. గరిష్ట వేగం గంటకు 58 కి.మీలు. ఒకసారి ఛార్జ్ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది.
ఆందోళన చెందాం
‘పెరుగుతున్న పెట్రోలు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే వాటి నుంచి మా కంపెనీ ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు ఈవీలు ఉపయోగించం వల్ల కొంతైనా కాలుష్యం కూడా తగ్గుతుంది. అందుకే ఈవీ స్కూటర్లు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాని అలయన్స్ డైరెక్టర్ సౌరభ్ అంటున్నారు.