దీపావళికి విశ్వ కిరీటం  | UNESCO adds Deepavali to global Intangible Heritage List | Sakshi
Sakshi News home page

దీపావళికి విశ్వ కిరీటం 

Dec 10 2025 4:10 PM | Updated on Dec 11 2025 5:33 AM

UNESCO adds Deepavali to global Intangible Heritage List

యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా 

విశ్వ వేదికపై మెరిసిన పండుగ 

న్యూఢిల్లీ: భారతదేశ సాంస్కృతిక వైభవానికి, తరతరాల జీవన సంస్కృతికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. చీకటిని చీల్చే దివ్య కాంతుల పండుగ దీపావళి.. బుధవారం యునెస్కో సాంస్కృతిక వారసత్వ నిధిగా ప్రపంచ వేదికపై ఘనంగా ఆవిష్కృతమైంది. యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో స్థానం సంపాదించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. 

ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరుగుతున్న యునెస్కో కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో కమిటీ కీలక చర్చల అనంతరం దీపావళిని గౌరవప్రదమైన ఈ జాబితాలో చేర్చినట్లు ప్రకటించగానే, ప్రాంగణమంతా ‘జై హింద్‌’, ‘వందేమాతరం’, ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలతో మారుమోగింది. వేదిక ముందు సంప్రదాయ వస్త్రధారణతో కళాకారులు ప్రదర్శనలు ఇవ్వగా, భారీ తెరపై దీపావళి పండుగ చిత్రాలు కనువిందు చేశాయి. 

జాబితాలో 16వ అంశంగా దీపావళి 
యునెస్కో యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో భారత్‌ నుంచి చేరిన 16వ అంశం దీపావళి. ఈ జాబితాలో ఇప్పటికే కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్‌కు చెందిన గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణం ఇతిహాసం సంప్రదాయ ప్రదర్శన అయిన రామలీల వంటి 15 ఇతర అంశాలు ఉన్నాయి. 

దీపావళి లోతైన భావోద్వేగం 
యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితా ఖరారుకు ఏర్పాటు చేసిన కమిటీ 20వ సమావేశంలో దీపావళిని ఎంపిక చేసినట్లు ప్రకటన వెలువడిన వెంటనే.. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దేశం తరపున కీలక ప్రకటన చేశారు. ‘ప్రతి భారతీయుడికి, దీపావళి అనేది లోతైన భావోద్వేగం, ఇది తరతరాలుగా అనుభూతి చెందుతోంది, జీవిస్తోంది, ఆస్వాదిస్తోంది’.. అని షెకావత్‌ తన ప్రసంగంలో అభివర్ణించారు. ఈ గుర్తింపు ద్వారా, ‘యునెస్కో పునరుద్ధరణ, శాంతి, మంచికి విజయం సాధించాలనే శాశ్వత మానవ వాంఛను గౌరవిస్తోంది’.. అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కుమ్మర్ల నుంచి కళాకారుల వరకు లక్షలాది చేతులు ఈ వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నాయని స్పష్టం చేశారు. 

భారత్‌ ఆతిథ్యం ఇదే తొలిసారి 
యునెస్కో అంతర–ప్రభుత్వ కమిటీ సమావేశానికి భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోట సముదాయంలో డిసెంబర్‌ 8 నుంచి 13 వరకు ఈ 20వ సమావేశం జరుగుతోంది. దీపావళిని యునెస్కో జాబితాలో చేర్చినందుకు పాకిస్తాన్‌ దౌత్యవేత్త షోయబ్‌ సర్వార్‌ భారత్‌కు అభినందనలు తెలిపారు. 

దాదాపు వారం రోజులుగా యునెస్కో నిర్వహిస్తున్న ఈ కీలక సమావేశంలో 80 దేశాలు సమరి్పంచిన మొత్తం 67 నామినేషన్లను పరిశీలిస్తున్నారు. మంగళవారం, బంగ్లాదేశ్‌ నుండి వచ్చిన తంగైల్‌ సంప్రదాయ చీర నేతకళ, ఆఫ్గానిస్తాన్‌ నుంచి బెహజాద్‌ శైలిలో సూక్ష్మ చిత్రలేఖనాన్ని యునెస్కో జాబితాలో చేర్చారు. పురుషుల అబా (గావున్‌) అయిన ’బిష్త్‌’ తయారీ నైపుణ్యాలు, అభ్యాసాలు కూడా ఈ జాబితాలో చేరాయి. ఇరాక్, జోర్డాన్, కువైట్‌ దేశాలకు చెందిన సాంస్కృతిక అంశాలు కూడా  బుధవారం యునెస్కో జాబితాలో స్థానం పొందాయి.

 

(చదవండి: గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement