ఏఐ డేంజర్‌.. బ్యాంకులకు ఆర్థిక మంత్రి కీలక సూచన | Strengthen Systems Against AI Risks FM Sitharamans Mandate to PSB Heads | Sakshi
Sakshi News home page

ఏఐ డేంజర్‌.. బ్యాంకులకు ఆర్థిక మంత్రి కీలక సూచన

Apr 24 2026 1:21 PM | Updated on Apr 24 2026 1:30 PM

Strengthen Systems Against AI Risks FM Sitharamans Mandate to PSB Heads

కృత్రిమ మేథ (ఏఐ) సరికొత్త నమూనాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ఫైనాన్షియల్‌ సిస్టమ్‌లలో లోపాలను ఆంథ్రోపిక్‌ మైథోస్‌ ఏఐ మోడల్‌ సులభంగా గుర్తించగలదన్న ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

ఎన్నో ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో లోపాలను గుర్తించినట్టు ఆంథ్రోపిక్‌ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ఏఐ రూపంలో ఆర్థిక వ్యవస్థకు వచ్చే రిస్క్‌లను ఎదుర్కొనే చర్యలు, సైబర్‌ భద్రతపై ఈ సమావేశంలో లోతుగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ సిస్టమ్‌లను మరింత పటిష్టంగా మార్చుకునే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సీతారామన్‌ సూచించినట్టు చెప్పాయి.

ఆర్‌బీఐ, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, బ్యాంక్‌ల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉల్లంఘనల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే రిస్క్‌లపై ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్టు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

ప్రధాన ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు, వెబ్‌ బ్రౌజర్‌లలో 27 ఏళ్ల నాటి లోపాలతో సహా వేలాది బగ్స్‌ను గుర్తించి, వాటిని వినియోగించుకునే విషయంలో మనుషుల కంటే మెరుగ్గా ‘మైథోస్‌’ ఏఐ మోడల్‌ రాణించగలదని ఆంథ్రోపిక్‌ పేర్కొనడం గమనార్హం. దీంతో యూఎస్‌ ఫెడ్‌ సహా పలు కేంద్ర బ్యాంక్‌లు ఏఐ ముప్పులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తుండడం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement