
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పెరగడం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు పతనమయ్యాయి.
ఇంట్రాడేలో 80,354.59 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 573.6 పాయింట్లు (0.7 శాతం) క్షీణించి 81,118.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 169.6 పాయింట్లు లేదా 0.68 శాతం క్షీణించి 24,718.6 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.24 శాతం, 0.43 శాతం నష్టపోయాయి.
అయితే రంగాలవారీ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎనర్జీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ లోని 30 షేర్లలో 26 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 శాతానికి పైగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ మాత్రమే లాభపడ్డాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధర బ్యారెల్కు 8.57 శాతం పెరుగుదలతో 73.87 డాలర్లకు ఎగసింది. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 7.6 శాతం పెరిగి 15.08 పాయింట్ల వద్ద స్థిరపడింది.