బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా భావిస్తుండటంతో పసిడికొనుగోళ్లు నానాటికి పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నప్పుడు కొనేవారికంటే రేటు తక్కువ ఉన్నప్పుడు భవిష్యత్తు అంచనాతో కొన్నవారే ఎక్కువ ప్రతిఫలం దక్కించుకుంటారు. ఇదే ఆలోచనలో గతంలో చాలా మంది ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేశారు. వారు ఇప్పుడు దాదాపు మూడింతల లాభాన్ని పొందుతున్నారు.
2017-18 సిరీస్-7 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) నేటికి (2025 నవంబర్ 13) మెచ్యూరిటీ తీరాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాటికి రూ.12,350 రిడంప్షన్ ధర ప్రకటించింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. 2017 వవంబర్ 13న వీటిని గ్రాముకు రూ.2934 లకు జారీ చేసింది. డిస్కౌంట్ పోగా వీటి ఆన్లైన్ ధర రూ.2,884. ఇప్పుడీ బాండ్లు 329 శాతం రాబడిని అందుకుంటున్నాయి. అంటే గ్రాముకు రూ.9466 లాభం అన్నమాట.
మరో సిరీస్కు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్
ఆర్బీఐ 2018-19 సిరీస్-3 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు కూడా ముందస్తు రిడంప్షన్ ప్రకటించింది. 2018 నవంబర్ 13న జారీ చేసిన ఈ బాండ్లను ముందస్తుగా 2018 నవంబర్ 13న గ్రాముకు రూ.12,350 ధర వద్ద రిడీమ్ చేసుకునే వెసులుబాటు ఉంది. గ్రాముకు రూ.3,146 ధర వద్ద జారీ చేసిన వీటి తుది గడువు 2026 నవంబర్ 13న తీరనుంది. ఇప్పుడు రిడీమ్ చేసుకుంటే గ్రాముకు 288 శాతం అంటే రూ.9204 లాభంతో సొమ్ము చేసుకోవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ పథకం గురించి..
భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం 2015 నవంబర్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేసింది. గ్రాములవారీగా ఈ గోల్డ్ బాండ్లపై పెట్టిబడి పెట్టినవారికి ద్వంద్వ ప్రయోజనాన్ని అందించాయి. ఇష్యూ ధరపై 2.5% స్థిర వార్షిక వడ్డీతో పాటు రిడంప్షన్ నాటికి అప్పటి ధరను పొందే అవకాశం కల్పించాయి.
వాస్తవంగా ఈ బాండ్లకు ఎనిమిదేళ్ల నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. కానీ మదుపరులు కోరుకుంటే ఐదేళ్ల తర్వాత వడ్డీ చెల్లింపు తేదీలలో నిష్క్రమించవచ్చు. ఈ గోల్డ్ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ చేయవచ్చు, ఇతరులకు బదిలీ చేయవచ్చు లేదా రుణాలకు పూచీకత్తుగా ఉపయోగించవచ్చు. కాగా రుణ భారం అధికమవడంతో ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో వీటి జారీని నిలిపివేసింది.
ఆదాయపు పన్ను చట్టం, 1961 (1961 సెక్షన్ 43) నిబంధనల ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది. అయితే ఈ బాండ్లను రీడీమ్ చేసినప్పుడు, మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎక్స్ఛేంజీలో బాండ్ల బదిలీ ఫలితంగా వచ్చే ఏదైనా మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనాలు ఉంటాయి.


