
నగరంలో ఐఓటీ గృహాలు!
డిజిటల్ తాళాలు, స్మార్ట్ కెమెరాలు, వీడియో డోర్ బెల్స్
పెరుగుతున్న ఐఓటీ ఆధారిత పరికరాల వినియోగం
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత ఇంటి స్వరూపం మారిపోయింది. ఇంటిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత భద్రతా ఉపకరణాల వినియోగం పెరిగింది. రియల్ టైమ్లో ట్రాక్ చేసే స్మార్ట్ కెమెరాలు, డిజిటల్ లాక్స్, స్మార్ట్ వీడియో డోర్ బెల్స్, లైట్లు, కర్టెన్లు ప్రతిదీ స్మార్ట్గా మారిపోయాయి. వేలిముద్ర, ఐరిష్ చూపిస్తే చాలు ఆటోమెటిక్గా ఇంటి తలుపులు తెరుచుకుంటాయి.
ఇంట్లో మనం లేకపోయినా ఎవరైనా అతిథులొస్తే ఫోన్లో నుంచే గుమ్మం తెరిచి స్వాగతం పలకొచ్చు. గదిలోకి రాగానే లైట్లు వాటంతటవే ఆన్, ఆఫ్ అవుతుండటం వంటి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. చాలా మంది బిల్డర్లు ఇంటి నిర్మాణ సమయంలోనే ఈ స్మార్ట్ ఉపకరణాలను జోడిస్తున్నారు.
కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్లోని హైఎండ్ ప్రాజెక్ట్లలో ఈ తరహా ఐఓటీ ఉపకరణాల ప్రాజెక్ట్లు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే వారు వ్యక్తిగత గృహాలలో సైతం వీటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది.