
సరికొత్త జీవిత కాల గరిష్టానికి ఢిల్లీ మార్కెట్లో 1,08,200
రూ.540 లాభపడిన బంగారం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో వెండి, బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధర గత ఆల్టైమ్ గరిష్టం రూ.1,08,100ను అధిగమించింది. ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,08,200 స్థాయికి చేరుకుంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.1,00,710 స్థాయిని తాకింది. రూ.540 లాభపడింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో 2012 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి 37 డాలర్లను వెండి అధిగమించింది.
రూపాయిలో బలహీనత దేశీ మార్కెట్లో బులియన్ ధరలకు మద్దతుగా నిలిచింది’అని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర పెద్దగా మార్పు లేకుండా 3,400 డాలర్ల స్థాయిలో ఉంది. డాలర్ బలపడడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల పెరుగుదల బంగారం ధరలపై ప్రభావం చూపించినట్టు కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది. దీనికితోడు బుధవారం యూఎస్ ఫెడ్ సమావేశం నిర్ణయాలు బయటకు రానుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి పాటించినట్టు తెలుస్తోంది.