ఈ షేర్లు- రేస్‌ గుర్రాలు | Sakshi
Sakshi News home page

ఈ షేర్లు- రేస్‌ గుర్రాలు

Published Tue, Dec 8 2020 4:42 PM

Shares touches record highs on positive news - Sakshi

ముంబై, సాక్షి: ఓవైపు దేశీ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుంటే.. మరోవైపు సానుకూల వార్తల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. వెరసి నేటి ట్రేడింగ్‌లో కొన్ని కంపెనీల షేర్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. జాబితాలో అల్ట్రాటెక్‌, గుడ్‌ఇయర్ ఇండియా‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

మార్కెట్‌ క్యాప్‌
సిమెంట్‌ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం ఎగసి రూ. 5.211 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 5,237 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 1.5 లక్షల కోట్లను తాకడం విశేషం. ఇటీవల 12.8 ఎంటీపీఏ ప్లాంటు ఏర్పాటుకు బోర్డు అనుమతించింది. ఇందుకు రూ. 5,477 కోట్లు వెచ్చించనుంది. దీంతో కంపెనీ మొత్తం సిమెంట్‌ తయారీ సామర్థ్యం 136.25 ఎంటీపీఏకు చేరనుంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రెసిడెన్షియల్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేరు 4 శాతం లాభపడి రూ. 1,255 వద్ద ముగిసింది. తొలుత రూ. 1262 వద్ద లైఫ్‌టైమ్‌ గరిష్టానికి చేరింది. 18 ఎకరాలలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. చదవండి: (పసిడి, వెండి- 2 వారాల గరిష్టం)

డీమార్ట్‌ జోరు
వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించడంతో గుడ్‌ఇయర్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లింది. రూ. 1,179 సమీపంలో సరికొత్త గరిష్టాన్ని చేరింది. చివరికి 16 శాతం లాభపడి రూ. 1,157 వద్ద ముగిసింది. డివిడెండ్‌ చెల్లింపునకు ఈ నెల 17 రికార్డ్‌డేట్‌గా పేర్కొంది. గత 7 రోజుల్లో ఈ షేరు 41 శాతం పెరిగింది! ఇక డీమార్ట్‌ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం బలపడి రూ. 2,678 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,689 వద్ద రికార్డ్‌ గరిష్టాన్ని తాకింది. గత 6 రోజుల్లో ఈ షేరు 16 శాతం ర్యాలీ చేసింది. కోవిడ్‌-19 లాక్‌డవున్‌ల తదుపరి తిరిగి బిజినెస్‌ జోరందుకోవడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement