
గతేడాది 91% రిటైల్ ఇన్వెస్టర్లు బేర్
సెబీ తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: గతేడాది(2024–25) ఈక్విటీ డెరివేటివ్స్లో అత్యధిక శాతం రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అంతక్రితం ఏడాది నమోదైన రీతిలోనే డెరివేటివ్స్లో చిన్న ఇన్వెస్టర్లు భారీగా దెబ్బతిన్నట్లు తెలియజేసింది. ఈ విభాగంలో వ్యక్తిగత ఇన్వెస్టర్ల నికర నష్టాలు వార్షికంగా 41 శాతం పెరిగి రూ. 1,05,603 కోట్లను తాకినట్లు వెల్లడించింది.
ఎఫ్అండ్వో విభాగంలో రిటైలర్లకు 2023–24లో రూ. 74,812 కోట్ల నష్టాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య సైతం 20 శాతం తగ్గినట్లు నివేదిక తెలియజేసింది. అంతకుపూర్వం రెండేళ్లలో ఈ విభాగంలో లావాదేవీలు చేపట్టే ప్రత్యేక రిటైలర్ల సంఖ్య 24 శాతం పుంజుకోవడం గమనార్హం!
ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్ మార్గదర్శకాలను పటిష్టపరుస్తూ 2024 అక్టోబర్ 1 నుంచి కొత్త చర్యలు ప్రకటించాక ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో లావాదేవీలపై సెబీ విశ్లేషణ చేపట్టింది. ఇందుకు 2024 డిసెంబర్ నుంచి 2025 మే వరకూ మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ల వ్యక్తిగత లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంది. మొత్తం రిటైల్ ట్రేడర్ల లాభనష్టాలను విశ్లేíÙంచాక దాదాపు 91 శాతం మంది నష్టపోయినట్లు గుర్తించింది. 2024 బాటలోనే రిటైల్ ట్రేడర్లు భారీగా పెట్టుబడులను కోల్పోయినట్లు సెబీ నివేదిక వివరించింది.
నష్టాల తీరిలా: గత ఆరు నెలల కాలంలో ఇండెక్స్ ఆప్షన్స్ టర్నోవర్ ప్రీమియంలవారీగా చూస్తే వార్షికంగా 9 శాతం క్షీణించినట్లు సెబీ నివేదిక పేర్కొంది. నోషనల్గా మదింపు చేస్తే 29 శాతం తగ్గింది. అయితే రెండేళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే ఇండెక్స్ ఆప్షన్స్ పరిమాణం ప్రీమియంలవారీగా 14 శాతం పుంజుకుంది. నోషనల్గా 42 శాతం ఎగసింది. ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో ప్రీమియంలవారీగా రిటైలర్ల టర్నోవర్ 11 శాతం క్షీణించింది. అయితే రెండేళ్ల క్రితం ఇదే కాలంలో 36 శాతం జంప్చేసింది. ఈ హెచ్చుతగ్గులు దేశీ మార్కెట్లో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ప్రధానంగా ఇండెక్స్ ఆప్షన్స్లో అధిక లావాదేవీలను పట్టిచూపుతున్నట్లు నివేదిక ప్రస్తావించింది. ఇన్వెస్టర్ల పరిరక్షణ, మార్కెట్ నిలకడ యోచనతో ఇండెక్స్ ఆప్షన్స్లో లావాదేవీలు, టర్నోవర్ను పర్యవేక్షిస్తున్నట్లు సెబీ వివరించింది. ఈ బాటలోనే 2025 మే 29న రిస్కుల పర్యవేక్షణా విధానాలు తదితరాలకు సెబీ తెరతీసింది.
జేన్ స్ట్రీట్ లాంటి రిస్క్లు పెద్దగా లేవు
సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే 3
ముంబై: మార్కెట్లో కలకలం రేపిన హెడ్జ్ ఫండ్ జేన్ స్ట్రీట్ తరహా రిసు్కలేమీ పెద్దగా కనిపించడం లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. నిఘాపరమైన సవాళ్ల వల్లే ఈ ఉదంతం చోటు చేసుకుందని, ఈ నేపథ్యంలో సర్వైలెన్స్పై సెబీ మరింతగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. నియంత్రణాధికారాలకు లోబడే జేన్ స్ట్రీట్పై చర్యలు తీసుకున్నామని, అయితే నిఘా, నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే నేరాలకు పాల్పడేవారిని కట్టడి చేయడానికి వీలవుతుందని పాండే పేర్కొన్నారు. డెరివేటివ్స్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నియంత్రణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి డేటా ఆధారితమైనవిగానే ఉంటాయని చెప్పారు. క్యాష్, డెరివేటివ్స్ విభాగాల్లో పొజిషన్లతో సూచీలను ప్రభావితం చేయడం ద్వారా రెండేళ్ల వ్యవధిలో అక్రమంగా ఆర్జించిన రూ. 4,800 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాకు బదలాయించాలని ఆదేశిస్తూ, జేన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలు భారత మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.