కిషోర్‌ బియానీకి ఊరట

Relief For Kishore Biyani As HC Stays Attachment Of Assets, Summons - Sakshi

ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై డివిజనల్‌ బెంచ్‌ స్టే

అమెజాన్‌–ఫ్యూచర్‌ వివాదంలో కీలక పరిణామం 

గ్లోబల్‌ ఈ–కామర్స్‌ దిగ్గజానికి నోటీసులు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు  రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారం అమ్మకానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందంపై ముందుకు వెళ్లకుండా ఫ్యూచర్‌ రిటైల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌)ను  తీవ్ర స్థాయిలో నిరోధిస్తూ 2021 మార్చి 18న జేఆర్‌ మిథా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన 134 పేజీల తీర్పుపై డివిజనల్‌ బెంచ్‌ సోమవారం తదుపరి విచారణ వరకూ స్టే విధించింది. ఫ్యూచర్‌ రిటైల్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను  చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం అనుమతిస్తూ, ఈ కేసులో ప్రతివాదైన గ్లోబల్‌ ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 18న సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలు అన్నింటిపై స్టే విధించాలన్న ఫ్యూచర్‌ గ్రూప్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో సింగిల్‌ జడ్జి గత మధ్యంతర ఉత్తర్వులపై డివిజనల్‌ బెంచ్‌ స్టే విధించడం, అనంతరం కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు కూడా వెళ్లడం వంటి అంశాల నేపథ్యంలో కేసులో మార్చి 18న సింగిల్‌ జడ్జి తుది తీర్పు ఎలా ఇస్తారని సాల్వే వాదించారు. ఆయా వాదనలతో ఏకీభవించిన హైకోర్డు డివిజనల్‌ బెం చ్, సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే విధించి తదుపరి కేసు విచారణను ఏప్రిల్‌ 30వ తేదీకి వాయిదా వేసింది.  చదవండి: (రూ.24,713 కోట్ల ఒప్పందం.. ఫ్యూచర్ గ్రూప్‌‌ మరో అడుగు) 

న్యాయపోరాటం ఇదీ... 
ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్‌ కూపన్స్‌ (ఎఫ్‌సీపీఎల్‌)లో అమెజాన్‌ కొంత వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటాలు ఉన్నందున.. అమెజాన్‌ కూడా పరోక్షంగా అందులోను స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్‌ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి (ఆర్‌ఐఎల్‌) విక్రయించేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌కు అనుమతుల కోసం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్‌..  తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్‌ సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్‌ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్‌ఆర్‌ఎల్‌.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ని ఆశ్రయించింది.

అమెజాన్‌తో ఎఫ్‌సీపీఎల్‌ ఒప్పంద నిబంధనలు, ఆర్‌ఐఎల్‌–ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్‌ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్‌ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపైనే అమెజాన్‌ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ లోపునే ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కీలక ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్‌ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్‌ విబేధాలకు సంబంధించి సింగపూర్‌ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్‌ (ఈఏ) 2020  అక్టోబర్‌ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్‌ గ్రూప్‌ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది.  ఫ్యూచర్‌ గ్రూప్‌ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్చూచ్‌ గ్రూప్‌ ఆ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్‌’ను విధించింది.

ఢిల్లీ కేటగిరీలో  సీనియర్‌ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్‌ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్‌ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్‌ చేయాలని  ఆదేశించింది. ఏప్రిల్‌ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్‌ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలు శిక్ష ఎందుకు విధించరాదని ప్రశ్నిస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచ్చింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 28వ తేదీకి వాయిదా వేసింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top