
నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. భారీ జరిమానాలు విధిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 353 బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలపై రూ .54.78 కోట్ల జరిమానాలు విధించినట్లు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన తన వార్షిక నివేదికలో తెలిపింది.
సైబర్ సెక్యూరిటీ, ఎక్స్పోజర్ నిబంధనలు, ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, కేవైసీ మార్గదర్శకాలు, మోసాల వర్గీకరణ, రిపోర్టింగ్ విషయాల్లో నిబంధనలు పాటించని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, సహకార బ్యాంకులపై ఆర్బీఐ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుంది. సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్కు డేటాను సమర్పించడం, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం వంటి అంశాల్లోనూ ఆయా సంస్థలు అలసత్వం ప్రదర్శించాయి.
మొత్తం జరిమానాలలో సహకార బ్యాంకులే అత్యధికంగా ఎదుర్కొన్నాయి. రూ.15.63 కోట్ల విలువైన 264 జరిమానాలను ఆర్బీఐ వాటిపై విధించింది. 37 ఎన్బీఎఫ్సీలు, ఏఆర్సీలు రూ.7.29 కోట్ల జరిమానా ఎదుర్కొన్నాయి. 13 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రూ.83 లక్షల జరిమానాను ఆర్బీఐ విధించింది. ఇక వాణిజ్య బ్యాంకుల్లో 8 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.11.11 కోట్లు, 15 ప్రైవేటు రంగ బ్యాంకులకు రూ.14.8 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు విదేశీ బ్యాంకులపైనా ఆర్బీఐ జరిమానా విధించింది.