ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తాత్కాలిక చీఫ్‌ బాధ్యతల పొడిగింపు

RBI gives 3-month extension to RBL Bank interim MD and CEO Rajeev Ahuja - Sakshi

మరో మూడు నెలలు రాజీవ్‌ అహూజా పదవీకాలం  

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తాత్కాలిక మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సీఈఓ) బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్‌ అహూజా పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.  మార్చి 25వ తేదీ నుంచి  మూడు నెలలు లేదా రెగ్యులర్‌ ఎండీ అండ్‌ సీఈఓ నియామకం జరిగే వరకూ ఏది ముందయితే దానికి వర్తించేలా ఆదేశాలు ఇస్తున్నట్లు బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ విశ్వవీర్‌ అహూజాను లీవ్‌పై పంపుతూ బ్యాంక్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది.

అలాగే బ్యాంక్‌ రోజూవారీ కార్యకలపాల నిర్వహణకు తాత్కాలిక చీఫ్‌గా రాజీవ్‌ అహూజాకి పదోన్నతి ఇచ్చి, ఇందుకు ఆర్‌బీఐ ఆమోదాన్ని కోరింది. డిసెంబర్‌ 25 నుంచి మూడు నెలలు ఆయన బాధ్యతల్లో ఉండేలా ఆర్‌బీఐ ఆమోదం లభించింది. తన చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ యోగేష్‌ కే దయాల్‌ను ఆర్‌బీఐ బ్యాంక్‌ బోర్డ్‌లో నియమించినట్లు ఆర్‌బీఐ 2021 డిసెంబర్‌ 24 ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో అప్పటి ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్‌ చీఫ్‌గా తన నియామకం తర్వాత డిసెంబర్‌ 26వ తేదీన   మీడియా, ఇన్వెస్టర్లతో రాజీవ్‌ అహూజా మొట్టమొదటిసారి మాట్లాడుతూ,  బ్యాంక్‌ ఆర్థికంగా పటిష్టంగా ఉందని తెలిపారు. డైరెక్టర్ల బోర్డు, ఆర్‌బీఐ నుంచి బ్యాంకుకు సంపూర్ణ మద్దతు ఉందని చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top