రెండు బ్యాంకుల విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం | RBI approved the merger of NICB with Saraswat Cooperative Bank | Sakshi
Sakshi News home page

రెండు బ్యాంకుల విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం

Aug 2 2025 1:13 PM | Updated on Aug 2 2025 1:33 PM

RBI approved the merger of NICB with Saraswat Cooperative Bank

సహకార బ్యాంకింగ్ విభాగంలో ఇటీవల మోసాలకు గురైన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఎన్ఐసీబీ)ను సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఎస్‌సీబీ)లో విలీనం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. ఈ విలీనం అధికారికంగా 2025 ఆగస్టు 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తేదీ నుంచి అన్ని ఎన్ఐసీబీ శాఖలు సారస్వత్ బ్యాంక్‌లో భాగంగా పనిచేస్తాయి.

సారస్వత్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..ఎన్ఐసీబీ డిపాజిటర్లతో సహా ఖాతాదారులను 2025 ఆగస్టు 4 నుంచి సారస్వత్ బ్యాంక్ కస్టమర్లుగా పరిగణిస్తామని తెలిపింది. వారి ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని పేర్కొంది. ఈ విలీన ప్రక్రియలో భాగంగా ఎన్ఐసీబీ ఆస్తులు, అప్పులన్నింటినీ సారస్వత్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంటుంది. డిపాజిట్లు, అడ్వాన్సులతో సహా ఎన్ఐసీబీ బ్యాంకింగ్ కార్యకలాపాలను సారస్వత్ వ్యవస్థలో విలీనం చేయనున్నారు.

ఈ విలీనంతో సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌గా మారుతుంది. మార్చి 31, 2025 నాటికి మొత్తం వ్యాపారం (డిపాజిట్లు + అడ్వాన్సులు) రూ.91,800 కోట్లుగా ఉంది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ మార్చి 2025 నాటికి మొత్తం రూ.3,500 కోట్ల వ్యాపారం సాగించింది. 

ఇదీ చదవండి: బీర్‌ పరిశ్రమలో ఊహించని సమస్య

2025 ఫిబ్రవరిలో న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు చెందిన ప్రభాదేవి ప్రధాన కార్యాలయం, గోరేగావ్ శాఖలో ఆర్‌బీఐ సాధారణ తనిఖీ సమయంలో రూ .122 కోట్ల అవకతవకలను కనుగొంది. ఫిజికల్ క్యాష్, లెడ్జర్ ఎంట్రీల మధ్య వ్యత్యాసాలతో వాల్ట్‌ల్లోని నగదులో మోసం జరిగినట్లు ధ్రువీకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement