విమాన సిబ్బంది తీరుపై అసహనం | passenger missing flight from Jaipur to Mumbai due to poor communication | Sakshi
Sakshi News home page

విమాన సిబ్బంది తీరుపై అసహనం

Jun 7 2025 2:54 PM | Updated on Jun 7 2025 4:08 PM

passenger missing flight from Jaipur to Mumbai due to poor communication

ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రయాణ సంస్థ సిబ్బంది సరిగా వ్యవహరించకపోవడంతో దాదాపు రూ.2.65 లక్షల విలువైన క్లయింట్‌ డీల్‌ను కోల్పోయినట్లు లింక్డ్‌ఇన్‌లో ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన జైపూర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ఇండిగో సిబ్బంది సరిగా వ్యవహరించకపోవడం వల్ల తాను ప్రయాణించాలనుకున్న విమానాన్ని మిస్సయ్యానని ఓ వ్యక్తి తెలిపారు.

చయాన్ గార్గ్ అనే ప్రయాణికుడు ‘ఇండిగో, మీరు దిగజారుతున్నారు’ అనే శీర్షికతో ఓ పోస్ట్ చేశారు. ‘నేను జైపూర్‌ నుంచి ముంబయి వెళ్లాలనుకున్నాను. దాంతో తెల్లవారుజామున 4:40 గంటలకు జైపూర్‌ విమానాశ్రయానికి చేరుకున్నాను. 5:10 గంటలకు సెక్యూరిటీ క్లియర్ చేశాను. 10-15 నిమిషాల్లో బోర్డింగ్ ప్రారంభమవుతుందని ఇండిగో ఎగ్జిక్యూటివ్ చెప్పారు. బోర్డింగ్ గేటు రద్దీగా ఉండటాన్ని గమనించి బోర్డింగ్ ప్రారంభానికి ముందు వాష్ రూమ్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను 12 నిమిషాల్లో తిరిగి వచ్చాను. అంతలోనే బోర్డింగ్ మూసివేశారు. ఆ సమయానికి బోర్డింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, మూసివేతపై ఆశ్చర్యపోయాను. గేటు మూసివేస్తున్నారని ఎలాంటి ప్రకటనలు చేయలేదు’ అని చెప్పారు.

ఇదీ చదవండి: యాపిల్‌ కొత్త ఓఎస్‌ గురించి తెలుసా..?

ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిని ప్రశ్నించగా జైపూర్ విమానాశ్రయంలో బహిరంగ ప్రకటన అవకాశాలు పరిమితంగా ఉన్నాయని తెలియజేసినట్లు గార్గ్‌ చెప్పారు. ఫ్లైట్‌ సిబ్బందిని వేడుకున్నప్పటికీ, తాను వెళ్లాల్సిన క్లయింట్ సమావేశం ఎంత అత్యవసరమో వివరించినప్పటికీ బోర్డింగ్‌ క్లియర్‌ చేయలేదని తెలిపారు. ప్రయాణానికి ప్రత్యామ్నాయం చూపలేదని చెప్పారు. టికెట్‌ఫేర్‌ రీఫండ్‌ ఇవ్వలేదన్నారు. కనీసం సిబ్బంది తనపై సానుభూతి చూపలేదని వాపోయారు. ఈ వ్యవహారం వల్ల తాను క్లయింట్‌ను కోల్పోయానని చెప్పారు. దీని విలువ రూ.2.65 లక్షలు, నెల రోజుల శ్రమ క్షణాల్లో వృథా అయిందని తెలిపారు.

ఇండిగో స్పందన

గార్గ్‌ లింక్డ్ఇన్ పోస్ట్‌కు ప్రతిస్పందనగా ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రామాణిక విధానాలను అనుసరించామని పేర్కొంటూ ప్రయాణికుడి నిరాశను అంగీకరించింది. ‘డియర్ మిస్టర్ గార్గ్, ఫ్లైట్‌ మిస్ అవ్వడం ఎంత నిరాశ కలిగిస్తుందో మాకు తెలుసు. మేము జాగ్రత్తగా ప్లాన్ చేసిన సమయానికి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేయాలనుకుంటున్నాం. మా సమీక్ష ప్రకారం ప్రామాణిక ప్రక్రియకు అనుగుణంగా బయలుదేరడానికి 25 నిమిషాల ముందు బోర్డింగ్ గేట్ మూసివేశారు. దురదృష్టవశాత్తూ గేటు మూసివేసిన తరువాత మీరు వచ్చారు. అప్పటికి టేకాఫ్ కోసం తుది సన్నాహాలు జరుగుతున్నాయి. మా ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తదుపరి అందుబాటులో ఉన్న విమానాన్ని మీకు సూచించారు. అందులో ప్రయాణించకూడదనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇండిగో వినియోగదారులందరికీ అంతరాయం లేని ప్రయాణాల కోసం నిరంతరం పనిచేస్తోంది’ అని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement