
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు సరికొత్త రికార్డును సాధించింది. ప్రపంచంలోని టాప్ టెక్నాలజీ హబ్లలో చేరింది. రియల్ ఎస్టేట్ సేవల సంస్థ సీబీఆర్ఈ విడుదల చేసిన గ్లోబల్ టెక్ టాలెంట్ గైడ్బుక్ 2025 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 12 'పవర్హౌస్' మార్కెట్లలో ఒకటిగా బెంగళూరు అవతరించింది.
అలాగే ఒక సరికొత్త మైలురాయిని కూడా బెంగళూరు చేరుకుంది. ఇక్కడ 10 లక్షలమందిపైగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే టెకీల అత్యధిక ఉన్న నగరంగా బెంగళూరు నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 12 'పవర్హౌస్' మార్కెట్లలో శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ మెట్రో, లండన్, టోక్యో, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన సాంకేతిక కేంద్రాలు ఉన్నాయి.
టెక్ టాలెంట్ లభ్యత, నాణ్యత, ఖర్చు ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 115 మార్కెట్లను సీబీఆర్ఈ నివేదిక అంచనా వేసింది. కేవలం శ్రామిక శక్తి పరిమాణంలోనే కాకుండా ప్రత్యేక నైపుణ్యాల్లో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లోనూ బెంగళూరు ప్రత్యేకతను చాటుకుంది. అగ్రశ్రేణి యూఎస్ టెక్ మార్కెట్లలో కనిపించే స్థాయిలతో సరిపోలుతూ భారతదేశంలో కృత్రిమ మేధ నిపుణులు ఈ నగరంలో అత్యధికంగా ఉన్నారని నివేదిక పేర్కొంది.
2019 నుండి 2024 వరకు బెంగళూరులో పనిచేసే వయసులో ఉన్నవారి జనాభా 2.4 శాతం పెరిగింది. వీరు ఆ నగర జనాభాలో 75.5% మంది ఉన్నారు. ఈ డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ టెక్నాలజీ రంగంలో బెంగళూరు విస్తరణకు కీలక చోదకాలలో ఒకటి. 28 యూనికార్న్ సంస్థలు, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల బలమైన ప్రవాహంతో నగరంలో స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. ఒక్క 2024లోనే బెంగళూరు 3.3 బిలియన్ డాలర్ల విలువైన 140 వీసీ ఒప్పందాలను దక్కించుకుంది.