ఒమిక్రాన్‌ వ్యాప్తి, ప్రపంచ పరిణామాలు...! స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయా..?

Omicron‌ spread Focus on global development Stock expert opinion On Stock Market - Sakshi

ఒమిక్రాన్‌ వ్యాప్తి వార్తలు

ప్రపంచ పరిణామాలపై దృష్టి 

ఈ వారం మార్కెట్‌పై స్టాక్‌ నిపుణుల అభిప్రాయం

ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ఒమిక్రాన్‌ వ్యాప్తి తీవ్రత వార్తలు ఈ వారం స్టాక్‌ సూచీలకు దిశా నిర్ధేశం చేస్తాయని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. యూఎస్‌ ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ మినిట్స్, ఓపెక్‌ సమావేశ నిర్ణయాలపై మార్కెట్‌ వర్గాలు ఓ కన్నేయొచ్చు. వీటితో పాటు క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది(2021) చివరి వారంలో మార్కెట్‌ తీవ్ర అస్థిరతను ఎదుర్కొన్నప్పటికీ.., రెండు శాతం ర్యాలీ చేసింది. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఆర్థిక, బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్‌ 1,130 పాయింట్ల, నిఫ్టీ 350 పాయింట్లు లాభపడ్డాయి. 

‘‘గత రెండు వారాలుగా మార్కెట్‌ రికవరీ దశలో ఉంది. అయినంత మాత్రాన పరిస్థితులు చక్కబడ్డాయనే అంచనాకు రావడం తగదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ అసాధారణ వేగంతో వ్యాప్తి చెందుతోంది. ట్రేడర్లు అప్రమతత్త వైఖరి కొనసాగిస్తూ.., రక్షణాత్మకంగా హెడ్డింగ్‌ పొజిషన్లను తీసుకోవడం ఉత్తమం. సాంకేతికంగా నిఫ్టీ నిర్ణయాత్మకమైన 17350 స్థాయిని చేధించి 17354 వద్ద ముగిసింది. అప్‌ట్రెండ్‌ కొనసాగితే 17,650 వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులతో అమ్మకాలు జరిగితే దిగువస్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది.’’ రిలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.   

స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తే..,  

ఒమిక్రాన్‌ ప్రభావం..
ఒమిక్రాన్‌ వేరియంట్‌ రోజుకు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. గతేడాది అక్టోబర్‌ రెండో తేదీ తర్వాత అత్యధిక ఈ ఏడాది తొలిరోజు(జనవరి 1న) 22,775 కేసుల నమోదయ్యాయి. కేసుల కట్టడికి దేశంలో ఇప్పటికే ప్రధాన రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆంక్షలను మరి కొంతకాలం పొడిగించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా అమెరికా, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, అర్జెంటీనా, కెనడా దేశాల్లో రోజుకు రెండు లక్షల చొప్పున కేసులు నమోదుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగితే ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిళ్లు పెరిగి, అనిశ్చితికి దారి తీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.  

స్థూల ఆర్థిక గణాంకాలు 
స్టాక్‌ మార్కెట్‌ ముందుగా ఇప్పటికే విడుదలైన డిసెంబర్‌ వాహన విక్రయ గణాంకాలు, జీఎస్‌టీ వసూళ్లపై స్పందించాల్సి ఉంది. భారత్‌తో పాటు యూరోజోన్, అమెరికాలు నేడు (సోమవారం) డిసెంబర్‌ మార్కిట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ డేటాను విడుదల చేయనున్నాయి. ఇవే దేశాలు బుధవారం(జనవరి 5న) సేవా రంగ పీఎంఐ గణాంకాలు ప్రకటించనున్నాయి. ఓపెక్‌ దేశాలు సమావేశం మంగళవారం జరగనుంది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పా లసీ కమిటీ మినిట్స్‌ బుధవారం వెలువడున్నాయి. యూరోజోన్‌ రిటైల్‌ డేటా.., అమెరికా ఉద్యోగ గ ణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ కీ లకమైన ఈ స్థూల గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది.  

విదేశీ, దేశీయ విక్రయాల ప్రభావం
గత రెండు నెలల ట్రెండ్‌ను కొనసాగిస్తూ డిసెంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. మొత్తం రూ.35,494 ల కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నా యి. 2021 ఏడాదిలో రూ.91,600 కోట్ల షేర్లను ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌ఐఐల వరుస విక్ర యాలు సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు)ను ప్రభావితం చేయలేకపోయాయి. డీఐఐలు డిసెంబర్‌లో రూ.31,231 కోట్ల షేర్లను, గత సంవత్సరంలో రూ.94,800 కోట్ల కొన్నారు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ ఎన్నికలు, ఒమిక్రాన్‌ కేసులు, వడ్డీరేట్ల వంటి పరిణామాల నేపథ్యంలో., భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకం కానుంది.

చదవండి: కొత్త ఏడాదిలో భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..!

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top