Income Tax Returns 2021-22: ఐటీ రిటర్నులకు డెడ్లైన్ జూలై 31
Published
Sat, Jul 23 2022 1:19 AM
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు పెంచే యోచనేదీ లేదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. జూలై 31 ఆఖరు తేదీగా ఉంటుందని, చాలా మటుకు రిటర్నులు తుది గడువులోగానే వస్తాయని అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను జూలై 20 వరకూ 2.3 కోట్ల పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయని, ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని బజాజ్ వివరించారు.
కోవిడ్ పరిణామాలు, ఐటీ పోర్టల్లో సమస్యలు తదితర అంశాల కారణంగా గతేడాది డిసెంబర్ 31 వరకూ గడువు పెంచిన సంగతి తెలిసిందే. ఈసారీ అలాగే జరుగుతుందనే ఉద్దేశంతో కొందరు నెమ్మదిగా ఐటీఆర్లు దాఖలు చేయొచ్చులే అని భావిస్తుండవచ్చని బజాజ్ పేర్కొన్నారు. కానీ ఈసారి డెడ్లైన్ను పొడిగించే యోచనేదీ లేదన్నారు. ప్రస్తుతం రోజువారీ 15–18 లక్షల రిటర్నులు వస్తుండగా .. రాబోయే రోజుల్లో 25 లక్షల నుంచి 30 లక్షల వరకూ పెరగవచ్చని వివరించారు.