Nitin Gadkari to launch Bharat NCAP today: All you need to know about this - Sakshi
Sakshi News home page

Bharat NCAP: భారత్ ఎన్‌సీఏపీ ప్రారంభం నేడే.. దీనివల్ల ఉపయోగాలెన్నో తెలుసా?

Aug 22 2023 10:37 AM | Updated on Aug 22 2023 11:05 AM

Nitin gadkari To launch Bharat NCAP today all you need to know about this - Sakshi

భారతదేశంలో మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను మరింత పెంచడానికి ఈ రోజు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' 'న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్' (Bharat NCAP) ప్రారంభించనున్నారు. వాహనాలలో సేఫ్టీ పెరిగితే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే భావనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది.

ఈ ప్రోగ్రామ్ కింద కార్ల తయారీదారులు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AIS) 197 ప్రకారం.. కార్లను స్వచ్ఛందంగా టెస్ట్ చేయడానికి అందించవచ్చు. దీని ద్వారా వాహనాలు సేఫ్టీ రేటింగ్ పొందుతాయి. ఇంతకీ భారత్ ఎన్‌సీఏపీ వల్ల ఉపయోగాలేమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇదీ చదవండి: మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా..

భారత్ ఎన్‌సీఏపీ ఉపయోగాలు..
➤ ఒక కంపెనీ తమ ఉత్పత్తులను టెస్ట్ చేయడానికి అందించినప్పుడు.. వాటి పనితీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ ప్రొటక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్స్ ప్రొటక్షన్ కోసం రేటింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది.

➤ భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు కార్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇది అధిక సేఫ్టీ కలిగిన కార్లను ఎంచుకోవడంలో ఉపయోగపడుతుందని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.

➤ ఆధునిక కాలంలో భద్రత ఎక్కువగా ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. అయితే దేశీయ కార్లు అంతర్జాతీయ మార్కెట్లో కూడా గుర్తింపు పొందటానికి భారత్ ఎన్‌సీఏపీ చాలా ఉపయోగపడుతుంది.

➤ భారత్ ఎన్‌సీఏపీ గుర్తించిన కార్లు తప్పకుండా విదేశాలకు ఎక్కువ సంఖ్యలో ఎగుమతి అవుతాయని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని తెలుస్తోంది.

➤ ఇప్పటికే రోడ్లపై 'బ్లాక్ స్పాట్స్' తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని నితిన్ గడ్కరీ ఇదివరకే వెల్లడించారు. దీంతో ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.

➤ ఒక్క 2021లో రోడ్డు ప్రమాదాలలో సుమారు 1.54 లక్షలమంది ప్రాణాలు కోల్పోగా.. 3.84 లక్షల మంది గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. 

➤ ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకి, టయోటా వంటి కంపెనీలు న్యూ కార్ అసెస్‌మెంట్ కార్యక్రమానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. మొత్తం మీద 2024నాటికి రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను సుమారు 50 శాతం తగ్గించాలని గడ్కరీ పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement