రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు | NCLT directed insolvency proceedings against Syska LED Lights | Sakshi
Sakshi News home page

రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు

Oct 15 2024 8:35 AM | Updated on Oct 15 2024 11:24 AM

NCLT directed insolvency proceedings against Syska LED Lights

రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు గాను సిస్కా ఎల్‌ఈడీ లైట్స్‌పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోనున్నారు. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రూ.7.70 కోట్ల బాకీల వసూలు కోసం రుణదాత సన్‌స్టార్‌ ఇండస్ట్రీస్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది.

సిస్కా ఎల్‌ఈడీ లైట్స్‌ బోర్డును రద్దు చేసి దివాలా పరిష్కార ప్రొఫెషనల్‌గా దేవాశీష్‌ నందాను ఎన్‌సీఎల్‌టీ నియమించింది. సన్‌స్టార్‌ సరఫరా చేసిన ఉత్పత్తుల నాణ్యతపై వివాదం నెలకొందని, ఆ కంపెనీ దివాలా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్న సిస్కా వాదనలను తోసిపుచ్చింది. సన్‌స్టార్‌కి సిస్కా రుణం చెల్లించాల్సి ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి: అదానీ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలన

ఎస్‌ఎస్‌కే గ్రూప్‌లో భాగంగా ఉన్న సిస్కా ఎల్‌ఈడీ లైట్స్‌కి ఎలక్ట్రికల్‌ గృహోపకరణాల సంస్థ సన్‌స్టార్‌ ఇండస్ట్రీస్‌ 60 రోజుల క్రెడిట్‌ వ్యవధితో ఉత్పత్తులను సరఫరా చేసేది. తొలినాళ్లలో సక్రమంగానే చెల్లింపులు జరిపినప్పటికీ 2023 మార్చి నుంచి జులై వరకు పంపిన 25 ఇన్‌వాయిస్‌లను చెల్లించకుండా డిఫాల్ట్‌ కావడంతో సన్‌స్టార్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement