ఎక్స్షోరూమ్ ధర రూ.47.5 లక్షలు
చెన్నై ప్లాంట్లోనే స్థానిక అసెంబ్లింగ్
చెన్నై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎమ్డబ్ల్యూ గ్రూప్ ఇండియా’ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం కారును ప్రవేశపెట్టింది. తన పోర్ట్ఫోలియోను మరింత విస్తరిస్తూ.. సరికొత్త ‘మినీ కంట్రీమ్యాన్ సీ’ క్రాస్ఓవర్ కారును బుధవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 47.50 లక్షలు (ఎక్స్షోరూమ్). దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభం కాగా, డెలివరీలను సైతం తక్షణమే చేపట్టనున్నారు.
ఇంజిన్ సామర్థ్యం
ఈ కారులో 1.5–లీటర్, 3–సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్ను అమర్చారు. బీఎమ్డబ్ల్యూ ‘ఎక్స్1’లో వాడిన ‘ఫ్రంట్–వీల్–డ్రైవ్ యూకేఎల్2’ ప్లాట్ఫారమ్పైనే దీనిని కూడా రూపొందించారు. 7–స్పీడ్ డ్యూయల్–క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పనిచేసే ఈ ఇంజిన్.. గరిష్టంగా 156 హార్స్ పవర్ను, 240 ఎన్ఎం టార్క్ను అందిస్తుంది.
అదిరిపోయే లుక్స్, ఫీచర్లు..
ఆక్టాగోనల్ ఫ్రంట్ గ్రిల్, రీ–ప్రొఫైల్డ్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, ప్రత్యేకమైన షాంపేన్–కలర్ ఎక్స్టీరియర్ ట్రిమ్తో ఈ కారు ప్రీమియం లుక్తో ఆకట్టుకుంటుంది. పాత మోడల్స్ కంటే ఇందులో క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. పనోరమిక్ సన్రూఫ్, లెవెల్–1 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్), 360–డిగ్రీల కెమెరాతో కూడిన పార్క్ అసిస్టెంట్ ప్లస్, 12–స్పీకర్ల ప్రీమియం ‘హార్మన్ కార్డన్’ మ్యూజిక్ సిస్టమ్ను ఇందులో జోడించారు.
స్థానిక అసెంబ్లింగ్...
‘ఈ సరికొత్త వేరియంట్ను చెన్నై ప్లాంట్లో స్థానికంగా అసెంబుల్ చేయడం మా బ్రాండ్కు పెద్ద మైలురాయి. దీని వల్లే కస్టమర్లకు ఇదొక అద్భుతమైన, అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయంగా మారింది’ అని బీఎమ్డబ్ల్యూ గ్రూప్ చెన్నై ప్లాంట్ ఎండీ థామస్ డోస్ తెలిపారు.


