టయోటా ఇన్నోవా క్రిస్టా సరికొత్త లగ్జరీ హంగులతో కస్టమర్ల ముందుకు వచ్చింది. కొత్త డిజైన్ అప్డేట్లు, ఆధునిక ఫీచర్లు, మరింత మెరుగైన క్యాబిన్ అనుభవంతో మల్టీ–పర్పస్ వెహికల్(ఎంపీవీ) విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే, ఇంజిన్, పనితీరులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీని ఎక్స్–షోరూమ్ ధర రూ. 19.72 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.
టయోటా డీలర్షిప్లో, సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే అన్ని మోడల్స్ ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వెనుక ఏసీ వెంట్స్, మొబైల్ ఛార్జర్ లాంటి ఫీచర్లున్నాయి. సుదూర ప్రయాణాల్లో సౌకర్యం, మంచి పనితీరు, బలమైన డీజిల్ ఇంజిన్ కారణంగా ఇన్నోవా క్రిస్టాకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఎంపీవీ లీటరుకు 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.
బీఎండబ్ల్యూ ఇండియా కార్ల ధరలు పెంపు
జూలై 1 నుంచి అమల్లోకి
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా’ వాహన ప్రియులకు షాక్ ఇచ్చింది. వచ్చే నెల (జూలై 1) నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు సోమ వారం ప్రకటించింది. తమ పోర్ట్ఫోలియోలోని బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్ల కార్ల ధరలపై 2 శాతం వరకు పెంపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దేశీయంగా తయారయ్యే మోడళ్లతో పాటు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల మోడళ్లకు ఈ ధరల పెంపు వర్తిస్తుంది.


