దాదాపు 10 మంది నన్ను చితకబాదారు: చోక్సీ | Mehul Choksi files complaint At Antigua Police Station Over Kidnap Issue | Sakshi
Sakshi News home page

దాదాపు 10 మంది నన్ను చితకబాదారు: చోక్సీ

Jun 7 2021 8:52 PM | Updated on Jun 7 2021 9:44 PM

Mehul Choksi files complaint At Antigua Police Station Over Kidnap Issue - Sakshi

న్యూఢిల్లీ: ఆంటిగ్వాకు చెందిన పోలీసులు త‌న‌ను విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టిన‌ట్లు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తెలిపాడు. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌కు రుణం ఎగ‌వేసిన కేసులో ప్రధాన నిందితుడైన చోక్సీ ప్ర‌స్తుతం ఆంటిగ్వాలో ఉన్నాడు. ఈ క్రమంలో తన సురక్షితస్థావరాన్ని వదిలి గర్ల్‌ఫ్రెండ్‌ను పొరుగునున్న డొమినికా దేశానికి డిన్నర్‌కు తీసుకెళ్లడమే మెహుల్‌ చోక్సీ పట్టివేతకు దారితీసింది. ఈ క్రమంలో ఆంటిగ్వాకు చెందిన సుమారు 8 నుంచి 10 మంది పోలీసులు త‌నను చిత‌క‌బాదిన‌ట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించాడు చోక్సీ. అంతేకాక తన కిడ్నాప్‌ వ్యవహారంలో బార్బరా జబారికాకు కూడా భాగం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

చోక్సీ జూన్‌ 2న ఇచ్చిన 5 పేజీల ఈ ఫిర్యాదులో.. ‘‘గత ఏడాది కాలంగా నేను, జబరికా చాలా స్నేహంగా ఉన్నాము. మే 23వ తేదీన ఆమె త‌న‌ను ఇంటి వ‌ద్ద పిక‌ప్ చేసుకోవాల‌ని చెప్పింది. అక్క‌డ‌కు వెళ్లిన త‌ర్వాత 8 నుంచి ప‌ది మంది నాపై దాడి చేశారు. ఏమాత్రం జాలీ, దయ లేకుండా నన్ను విపరీతంగా కొట్టారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న జ‌బారికా వారిని ఏమాత్రం అడ్డుకోలేదు. క‌నీసం మ‌రొక‌రి స‌హాయం కూడా ఆమె కోర‌లేదు. జ‌బారికా వ్య‌వ‌హ‌రించిన తీరు అనుమానం రేకిత్తిస్తుంది. నన్ను కిడ్నాప్ చేసిన వారిలో ఆమె కూడా భాగ‌స్వామి అని డౌట్ వ‌స్తోంది’’ అని వెల్లడించాడు చోక్సీ. 

ఫోన్‌, వాచ్‌, వ్యాలెట్ తీసుకుని త‌న‌పై వాళ్లు దాడి చేసిన‌ట్లు చోక్సీ తెలిపాడు. ఇక తనను కిడ్నాప్‌ చేసిన వారు పడవలో తీసుకెళ్లారని.. బోటు మీద 2 భారతీయులు, ముగ్గురు కరేబియన్లు ఉన్నారని వెల్లడించాడు. ఆ తర్వాత ఉన్నత స్థాయి భారతీయ రాజకీయ నాయకుడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి తనను ప్రత్యేక ప్రదేశానికి తీసుకువెళ్లారు అని చోక్సీ తన ఫిర్యాదులో ఆరోపించాడు. 

ఇక ఇంటర్‌పోల్‌ రెడ్ కార్నర్ నోటీసు కారణంగా చోక్సీని అరెస్ట్‌ చేశారు. ఇక పోలీస్‌ స్టేషన్‌లో తనను ఉంచిన "హోల్డింగ్ సెల్" వద్ద ఉన్న పరిస్థితులను కూడా చోక్సీ ప్రస్తావించాడు. ‘‘నన్ను ఉంచిన గది కేవలం 20 చదరపు అడుగుల పరిమాణంలో ఉంది. దానిలో కనీసం ఓ పరుపు కూడా లేదు’’ అని తెలిపాడు. పీఎన్‌బీ కేసులో చోక్సీని ఇండియాకు తీసుకువ‌చ్చేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మైన సంగతి తెలిసిందే. త‌న‌ను ఎవ‌రో అప‌హ‌రించాలంటూ చోక్సీ త‌ర‌పు న్యాయ‌వాదులు పేర్కొనడంతో ఆ ఘ‌ట‌న‌పై ఆంటిగ్వా ప్ర‌ధాని విచార‌ణ‌కు ఆదేశించారు. చోక్సీ లాయ‌ర్లు కిడ్నాప‌ర్ల పేర్లు పోలీసుల‌కు చెప్పార‌ని ప్ర‌ధాని బ్రౌనీ తెలిపారు.

చదవండి: మిషన్‌ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే?

Advertisement
 
Advertisement
Advertisement