చివర్లో అమ్మకాలు- ఫార్మా ధూమ్‌ధామ్ | Market weakens on fag end selling- Pharma stocks zoom | Sakshi
Sakshi News home page

చివర్లో అమ్మకాలు- ఫార్మా ధూమ్‌ధామ్

Sep 18 2020 4:06 PM | Updated on Sep 18 2020 8:21 PM

Market weakens on fag end selling- Pharma stocks zoom - Sakshi

తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లను చివరి గంటలో పెరిగిన అమ్మకాలు దెబ్బతీశాయి. వెరసి నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 134 పాయింట్లు క్షీణించి 38,846 వద్ద స్థిరపడగా..  నిఫ్టీ స్వల్పంగా 11 పాయింట్ల వెనకడుగుతో 11,505 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో సెన్సెక్స్‌ 39,200 వద్ద గరిష్టాన్ని తాకగా.. చివర్లో  38,636 పాయింట్ల దిగువకు సైతం చేరింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 11,584- 11,446  పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. అయితే తొలి నుంచీ ఇన్వెస్టర్లు ఫార్మా కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో బీఎస్‌ఈలో హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 20,689 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది.

ఫార్మా జోరు
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగం 5 శాతం జంప్‌చేయగా.. రియల్టీ 2 శాతం, ఆటో 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. బ్యాంక్‌ నిఫ్టీ 1.3 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.6 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్ 10 శాతం, సిప్లా 7 శాతం చొప్పున దూసుకెళ్లగా.. అదానీ పోర్ట్స్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, గ్రాసిమ్‌, టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, హిందాల్కో, విప్రో, పవర్‌గ్రిడ్‌, హీరో మోటో, ఓఎన్‌జీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, యూపీఎల్‌ 3.7-1.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, శ్రీ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌, కొటక్‌ బ్యాంక్‌, మారుతీ, టైటన్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, ఐవోసీ, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ 2.2-0.75 శాతం మధ్య  క్షీణించాయి.

డెరివేటివ్స్‌లోనూ..
డెరివేటివ్‌ కౌంటర్లలో లుపిన్‌, దివీస్‌, కేడిలా, గ్లెన్‌మార్క్‌, అపోలో హాస్పిటల్స్‌,  అరబిందో, డీఎల్‌ఎఫ్‌, బయోకాన్‌, సన్‌ టీవీ 4.5-2.3 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క టాటా కెమ్‌, అపోలో టైర్‌, పెట్రోనెట్‌, బంధన్‌ బ్యాంక్‌, టొరంట్‌ పవర్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, పిరమల్‌, వోల్టాస్‌, కోఫోర్జ్‌, అమరరాజా, జూబిలెంట్‌ ఫుడ్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, పీఎన్‌బీ, జిందాల్‌ స్టీల్‌, కమిన్స్‌  3.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.25 శాతం పుంజుకోగా, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1308 లాభపడగా.. 1431 నష్టాలతో నిలిచాయి.

అమ్మకాలవైపు..
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 250 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.  

Advertisement
 
Advertisement
Advertisement