ఆటుపోట్ల మధ్య మార్కెట్లు షురూ

Market trading in consolidation mode - Sakshi

142 పాయింట్లు మైనస్‌- 43,689కు సెన్సెక్స్‌

34 పాయింట్లు క్షీణించి 12,824 వద్ద కదులుతున్న నిఫ్టీ

ఐటీ, బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌ డౌన్‌- పార్మా అప్

‌ బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం మైనస్‌

ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనం నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రారంభంలో కోలుకున్నప్పటికీ తదుపరి ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. వెరసి లాభనష్టాల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 142 పాయింట్లు క్షీణించి 43,689 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 34 పాయింట్లు తక్కువగా 12,824 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,023 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,683 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీలో 12,917-12,816 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. నేడు నవంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్‌ చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తారని, దీంతో ఆటుపోట్లకు అవకాశమున్నదని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. బుధవారం ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలతో రికార్డుల ర్యాలీకి బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. 

ఫార్మా మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలన్నీ0.6-0.2 శాతం మధ్య బలహీనపడగా.. ఫార్మా 0.15 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్‌, టైటన్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, శ్రీ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఎంఅండ్‌ఎం, దివీస్ 1.2-0.25 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇండస్‌ఇండ్‌, ఐషర్, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే, మారుతీ, బీపీసీఎల్, బ్రిటానియా, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, ఐవొసీ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

చిన్న షేర్లు వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో సీమెన్స్‌ 7 శాతం జంప్‌చేయగా.. భారత్‌ ఫోర్జ్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, యూబీఎల్‌, మదర్‌సన్, అపోలో హాస్పిటల్స్‌, ఆర్‌ఈసీ, భెల్‌ 3-1.6 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఇండిగో, శ్రీరామ్‌ ట్రాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్‌,  బాష్‌, ఎస్కార్ట్స్‌ 4-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 948 లాభపడగా.. 1,023 నష్టాలతో ట్రేడవుతున్నాయి.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు రూ. 2,522 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top