నష్టాలలో మార్కెట్లు- ఫార్మా ఎదురీత

Market open in red- Pharma up - Sakshi

175 పాయింట్లు మైనస్‌- 39,127 వద్దకు సెన్సెక్స్‌

51 పాయింట్ల నష్టంతో 11,554 వద్ద నిఫ్టీ ట్రేడింగ్‌

ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలు వీక్‌- ఫార్మా అప్‌

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.25 శాతం మైనస్‌

సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 175 పాయింట్లు క్షీణించి 39,127ను తాకగా.. నిఫ్టీ 51 పాయింట్ల వెనకడుగుతో 11,554 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,141- 39,022 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11563- 11521 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. తాజా పాలసీ సమీక్షలో యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ దీర్ఘకాలంపాటు నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. అయితే టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో బుధవారం యూఎస్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు బలహీనపడ్డాయి. 

బ్లూచిప్స్‌ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, రియల్టీ, ఐటీ, మెటల్‌, ఆటో 1-0.5 శాతం మధ్య నీరసించగా..  ఫార్మా 0.4 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హీరోమోటో, సిప్లా, బ్రిటానియా, బీపీసీఎల్‌, నెస్లే 3-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే హిందాల్కో, ఐసీఐసీఐ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, కొటక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, విప్రో, శ్రీ సిమెంట్‌, ఎస్‌బీఐ 2-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. 

డెరివేటివ్స్‌లో
డెరివేటివ్‌ కౌంటర్లలో అశోక్‌ లేలాండ్‌, ఐడియా, కమిన్స్‌, అరబిందో, ఎస్కార్ట్స్‌, ముత్తూట్‌, లుపిన్‌, ఎక్సైడ్‌, టాటా కెమ్‌, బంధన్‌ బ్యాంక్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. మెక్‌డోవెల్‌, సెయిల్‌, టాటా పవర్‌, చోళమండలం, కోఫోర్జ్‌, పిడిలైట్‌, అపోలో టైర్‌ 4-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.25 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 753 లాభపడగా.. 884 నష్టాలతో కదులుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top