చివరికి నష్టాలే- రియల్టీ, మెటల్‌ జోరు

Market ends in red- Realty, Metal gains - Sakshi

136 పాయింట్ల క్షీణత- 39,614కు సెన్సెక్స్‌

28 పాయింట్లు తగ్గి 11,642 వద్ద ముగిసిన నిఫ్టీ 

ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగాలు వీక్‌

రియల్టీ, మెటల్‌, మీడియా, ఐటీ, ఫార్మా ఓకే

బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.6 శాతం ప్లస్‌

ఆటుపోట్ల మధ్య నవంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు నీరసంగా ముగిసింది. సెన్సెక్స్‌ 136 పాయింట్లు క్షీణించి 39,614 వద్ద నిలవగా.. నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 11,642 వద్ద స్థిరపడింది. తొలుత స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన సెన్సెక్స్‌ 39,988 వరకూ ఎగసింది. మిడ్‌సెషన్‌కల్లా 39,242కు వెనకడుగు వేసింది. వెరసి ఇంట్రాడేలో 750 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. ఇక నిఫ్టీ సైతం 11,749- 11,535 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు తిరిగి పెరుగుతుండటం, యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఆటో డీలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగాలు 1.2-0.8 శాతం మధ్య బలహీనపడ్డాయి. రియల్టీ 2.2 శాతం పుంజుకోగా.. మెటల్‌, మీడియా 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఐటీ, ఫార్మా 0.2 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్‌టెల్‌, హీరో మోటో, మారుతీ, ఐషర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, బ్రిటానియా, బజాజ్‌ ఆటో 4-1.5 శాతం మధ్య నష్టపోయాయి. అయితే అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, హిందాల్కో, ఆర్‌ఐఎల్‌, టాటా స్టీల్‌, గెయిల్‌, నెస్లే 4.5-1.7 శాతం మధ్య ఎగశాయి.

చోళమండలం జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎంఆర్‌ఎఫ్‌, బీవోబీ, గోద్రెజ్‌ సీపీ, అపోలో టైర్‌, ఇండిగో, జూబిలెంట్‌ ఫుడ్‌, లుపిన్‌, కమిన్స్‌, మారికో, నౌకరీ. టాటా కెమికల్స్‌ 3.5-1.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కాగా.. మరోవైపు చోళమండలం, టీవీఎస్‌ మోటార్‌, ఐడియా, హెచ్‌పీసీఎల్‌, జీ, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌, పిరమల్‌, అమరరాజా, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ 8.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.6 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,338 లాభపడగా.. 1,240 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,131 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు సైలంట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,515 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top