అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ (Johnson & Johnson) టాల్కం పౌడర్కు సంబంధించిన కేసుల కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీ తయారు చేసిన టాల్కం పౌడర్ వినియోగం వల్ల అండాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని, వేలాది మంది కోర్టులను ఆశ్రయించారు. ఈ వివాదం చాన్నాళ్లుగా కొనసాగుతూనే ఉంది. దీనికి ముగింపు పలకడానికి సంస్థ భారీ మొత్తంలో పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది.
జాన్సన్ & జాన్సన్ సంస్థ దాదాపు 76,000 కేసులను పరిష్కరించడానికి 5.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.52 వేలకోట్లు) చెల్లించాలని ప్రతిపాదించింది. చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరాటం వల్ల కంపెనీ ప్రతిష్ఠ చాలా వరకు దెబ్బతింది. ఇది సంస్థ ఆర్ధిక పరిస్థితి మీద కూడా ప్రభావం చూపింది. ఈ కారణంగానే.. సంస్థ ఈ వివాదాన్ని శాశ్వతంగా ముగించాలని నిర్ణయించింది.
క్యాన్సర్కు కారణమయ్యే అస్బెస్టాస్
జాన్సన్ & జాన్సన్ తయారు చేసిన టాల్కం బేబీ పౌడర్ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల..తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు అండాశయ క్యాన్సర్ లేదా మెసోథెలియోమా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. టాల్కం పౌడర్లో క్యాన్సర్కు కారణమయ్యే అస్బెస్టాస్ అనే పదార్థం ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు.
బేబీ పౌడర్ అమ్మకాల నిలిపివేత
ఈ ఆరోపణలను జాన్సన్ & జాన్సన్ కంపెనీ పూర్తిగా తిరస్కరిస్తోంది. తమ ఉత్పత్తులు క్యాన్సర్కు కారణమవుతాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సంస్థ స్పష్టం చేసింది. అయినప్పటికీ.. వినియోగదారుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, 2020లో అమెరికాలో మాత్రమే కాకుండా కెనడాలో కూడా టాల్కం ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది. కాగా ఇప్పుడు వివాదానికి ముగింపు పలకడానికి పరిహారం చెల్లించేందుకు సన్నద్ధమైంది.
ఇదీ చదవండి: అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్!


