భారత్‌లోకి జెటూర్ టీ2.. ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ! | Jetour T2 Set for India Launch Ready to Challenge the Fortuner | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి జెటూర్ టీ2.. ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ!

Jun 6 2026 5:46 PM | Updated on Jun 6 2026 6:42 PM

Jetour T2 Set for India Launch Ready to Challenge the Fortuner

ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యు మోటార్స్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ చెరీ ఆటోమొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలో ఈ రెండు కంపెనీల తొలి ఉత్పత్తిగా 'జెటూర్ టీ2' (Jetour T2) ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్ చేయనున్నాయి.

జెటూర్ టీ2 కారు ఇండియన్ మార్కెట్లో 2026 దీపావళి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జేఎస్‌డబ్ల్యు ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. ఈ కారు ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

జెటూర్ టీ2 ఇండియన్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ మెజెస్టర్, స్కోడా కోడియాక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌ సిస్టం పొందుతుంది. కాబట్టి మైలేజ్ గణనీయంగా పెరుగుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతున్న జెటూర్ టీ2లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 26.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. సింగిల్ మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ అనే రెండు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీతో ఈ వాహనం కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 139 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.

ఫీచర్ల విషయానికి వస్తే.. జెటూర్ టీ2లో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12 స్పీకర్ల సోనీ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అదనంగా లెవల్-2 ఏడీఏఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

గ్లోబల్ మార్కెట్లలో జెటూర్ టీ2 మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా లభిస్తున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ప్రారంభ దశలో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌ను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే.. ఈ కారు లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన ఇంధన సామర్థ్యం, ప్రీమియం ఫీచర్లతో ఎస్‌యూవీ విభాగంలో గట్టి పోటీ ఇస్తుందని పలువురు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement