పారిశ్రామిక దిగ్గజాల చూపు ‘ఇండస్ట్రీ ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్‌’ వైపు | Industrial Giants investments coming to Industry friend Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక దిగ్గజాల చూపు ‘ఇండస్ట్రీ ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్‌’ వైపు

Sep 23 2022 6:14 PM | Updated on Sep 23 2022 7:11 PM

Industrial Giants investments coming to Industry friend Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవం గురించి మును ముందు చర్చించుకోవలసి వస్తే  2019కి ముందు.. ఆ తర్వాత అని చెప్పుకోవలసి వస్తుంది. ఎందుకంటే 2019 తర్వాతనే ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు ఊపందుకున్నాయి. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా పచ్చపత్రికలు ఎన్ని కుళ్లు రాతలు రాసినా దత్తపుత్రులు ఎంత రోతగా ఏడ్చినా రాష్ట్రం పారిశ్రామికంగా పరుగులు పెడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

టీడీపీ హయాంలో  ప్రపంచవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉన్నా పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ 2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వంటి సంక్షోభాలు ఆర్ధిక వ్యవస్థలను తల్లకిందులు చేసిన ప్రతికూల పరిస్థితుల్లోనూ పారిశ్రామిక పెట్టుబడులు చంద్రబాబు హయాంలో కన్నా ఎక్కువగా వచ్చాయి. పారదర్శకమైన విధానాలు, లంచాలకు ఆస్కారం లేని పర్యవేక్షణలు ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది.

వరుసగా మూడో ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో  నంబర్‌ వన్‌
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఇండస్ట్రియల్ స్టేట్‌గా రూపాంతరం చెందింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు ఇపుడు ఏపీ వైపే చూస్తున్నారు. కొత్త పరిశ్రమలు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ను మించిన అనువైన వేదిక పారదర్శకమైన పారిశ్రామిక విధానాలు ఇంకెక్కడా లేవని వారు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు కల్పిస్తోన్న సదుపాయాలు ఇస్తోన్న ప్రోత్సాహకాలతో  అందరిలోనూ విశ్వాసం పెరిగింది. పరిశ్రమలకు అత్యంత అనువైన విధానాలు ఉన్నాయి కాబట్టే ఆంధ్ర ప్రదేశ్ వరుసగా మూడో ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నంబర్ వన్‌గా కొనసాగుతోంది. పారిశ్రామిక వేత్తలు ఏపీలో సంతోషంగా ఉన్నారనడానికి ఇదే తిరుగులేని నిదర్శనం. ఇంతగా రాష్ట్రం దూసుకు పోతుంటే.. ప్రతిపక్ష తెలుగుదేశం, దానికి వంత పాడే  కొన్ని మీడియా సంస్థలు మాత్రం రోజూ ప్రభుత్వంపై బురద జల్లుతూ కాలక్షేపం చేస్తున్నాయి.

పరిశ్రమల స్థాపన మొదలుకుని ఉత్పత్తి సాధించే వరకు ప్రతీదశలోనూ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాలు పారదర్శకంగా ఉండడమే కాకుండా ప్రోత్సాహ కరంగా ఉంటున్నాయని పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నారు. అందుకే ఏపీపై దిగ్గజాలకు నమ్మకం కుదిరింది. గతంలో ఎన్నడూ ఏపీ వైపు చూడని పారిశ్రామిక వేత్తలు ఇపుడు ఏపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 నుండి ఇప్పటి వరకు ఏపీలో పెట్టుబడులు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. కరోనా సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని చావుదెబ్బతీసిన గడ్డుకాలంలోనూ ఏపీలో పెట్టుబడులు ఆశాజనకంగానే ఉండడం అందుకు నిదర్శనం. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోల్చి చూస్తే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోందంటున్నారు నిపుణులు.

కొత్తగా పరిశ్రమలు వస్తే  యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. దాంతో ఆ ఉద్యోగుల ఇళ్లల్లో జీవితాలు బాగుపడుతాయి. ఆ క్రమంలో గ్రామాలకు గ్రామాలు వెలుగుతాయి. అంతిమంగా  ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుంది. మూడేళ్లుగా ఈ ఆర్ధిక సూత్రాన్ని అనుసరించే  ఆంధ్ర ప్రదేశ్ గ్రోత్ రేట్ అద్భుతంగా పెరుగుతూ వచ్చి ఇపుడు దేశంలోనే అగ్రగామిగా ఉంది ఏపీ. తాజాగా 11.43శాతం గ్రోత్ రేట్ తో ఏపీ నంబర్ వన్ గా నిలిచి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావడం లేదని ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విష ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఈ విషయాన్ని తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యాధారాలతో సహా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోన్న తీరును వివరించారు.

కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిని దక్కించుకోడానికి దేశంలోని 17 రాష్ట్రాలు పోటీలు పడ్డాయి. వాటిలో ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాలు వాటిని దక్కించుకున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీలోని ప్రతిపక్షం ఏపీకి ఆ పార్కు వద్దే వద్దు అంటూ ఏకంగా కేంద్రానికి లేఖలు రాసింది.  చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేత శాసన మండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్వయంగా తన లెటర్‌ హెడ్‌పై కేంద్రానికి లేఖలు రాసి అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ నేతలు చెప్పే సాకులు ఏంటంటే డ్రగ్ పార్క్ వస్తే కాలుష్యం పెరుగుతుంది కాబట్టి అడ్డుకున్నామని  కథలు మొదలెట్టారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే కాకినాడలో దివీస్ ఫార్మా కంపెనీని దగ్గరుండి పెట్టే కార్యక్రమం చేశారు చంద్రబాబు.

ఒక పక్క ఇలా అసత్య ప్రచారం చేస్తోన్న తెలుగుదేశం మరో పక్క ఏపీకి వచ్చే పరిశ్రమలను రానీయకుండా అడ్డుకోడానికి విఫల యత్నాలు కుట్రలు చేస్తోంది. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా పచ్చపత్రికలు ఎన్ని కుళ్లు రాతలు రాసినా దత్తపుత్రులు ఎంత రోతగా ఏడ్చినా రాష్ట్రం పారిశ్రామికంగా పరుగులు పెడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనలోనూ స్థూల జాతీయోత్పత్తిలోనూ కూడా చంద్రబాబు పాలనలో కన్నా ఇపుడే ఆంధ్రప్రదేశ్ అద్భుత ఫలితాలు సాధిస్తోందని ఆయన అంటున్నారు. పరిశ్రమల స్థాపన ఒక ఎత్తు అయితే వచ్చే పరిశ్రమలకు సరిపడ మానవ వనరులను సిద్దం చేయడం మరో ఎత్తు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఏ కొత్త పరిశ్రమ వచ్చినా  స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని నిబంధన పెట్టారు. అందుకు అనుగుణంగా ఆ 75 శాతం ఉద్యోగాలను భర్తీ చేయడానికి వీలుగా యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు సీఎం జగన్‌. అందుకోసం స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీలను పెట్టడంతో పాటు అన్ని నియోజకవర్గాలను అనుబంధంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఒక పక్క భారీ పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూనే మరో పక్క సూక్ష్మ చిన్న మధ్య తరహా తయారీ సంస్థలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఒకప్పుడు పరిశ్రమ పెట్టడానికి ఎవరైనా వస్తే  మాకేంటి అని అడిగే సంస్కృతి ఉండేదని.. దానికి చరమగీతం పాడడం వల్లనే ఇపుడు పరిశ్రమలు తరలి వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement