టికెట్‌ బుక్‌ అవ్వకుండానే రూ.100 కట్‌! ఐఆర్‌సీటీసీ రిప్లై ఇదే.. | Indian Railway rules of waitlisted/RAC ticket clerkage charges | Sakshi
Sakshi News home page

టికెట్‌ బుక్‌ అవ్వకుండానే రూ.100 కట్‌! ఐఆర్‌సీటీసీ రిప్లై ఇదే..

Nov 1 2024 9:39 AM | Updated on Nov 1 2024 11:01 AM

Indian Railway rules of waitlisted/RAC ticket clerkage charges

పండగ సీజన్‌లో రైళ్లు కిక్కిరిసిపోవడం గమనిస్తాం. దాంతో చాలామంది ప్రయాణికులు ముందుగానే రైలు టికెట్‌ బుక్‌ చేసుకుంటూంటారు. అయితే చివరి నిమిషం వరకు టికెట్‌ బుక్‌ అవ్వకపోతే కొన్ని ఛార్జీల రూపంలో రైల్వే విభాగం కొంత డబ్బులు కట్‌ చేసుకుని మిగతా నగదును సంబంధిత ప్రయాణికుడి ఖాతాలో జమ చేస్తోంది. దీనిపై ప్రశ్నిస్తూ ఇటీవల ఎక్స్‌ వేదికగా వెలిసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

అన్సారీ అనే ప్రయాణికుడు చేసిన పోస్ట్‌ ప్రకారం..‘నేను ఢిల్లీ నుంచి ప్రయారాజ్‌ వెళ్లాలనుకున్నాను. అందుకోసం రైల్వే టికెట్‌ బుక్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న టికెట్‌ను బుక్‌ చేశాను. కానీ నా టికెట్‌ కన్ఫర్మ్‌ అవ్వలేదు. ఫైనల్‌ చార్ట్‌ కూడా ప్రిపేర్‌ అయింది. అయితే నేను ముందుగా చెల్లించిన టికెట్‌ ధరలో రూ.100 కట్‌ అయి మిగతా నా ఖాతాలో జమైంది. నాకు టికెట్‌ కన్ఫర్మ్‌ అవ్వకుండా రూ.100 ఎందుకు కట్‌ చేశారో చెప్పగలరా?’ అంటూ ఇండియన్‌ రైల్వే మినిస్ట్రీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ను తన ఎక్స్‌ ఖాతాలో ట్యాగ్‌ చేశారు.

ప్రతి ప్యాసింజర్‌కు ఇదే నియమం

ఐఆర్‌సీటీసీ విభాగం తన అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా ఈ పోస్ట్‌పై స్పందించింది. ‘భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం వెయిటింగ్‌ లిస్ట్‌ లేదా ఆర్‌ఏసీ టికెట్‌కు సంబంధించి క్లర్కేజ్‌ ఛార్జీల కింద ప్రతి ప్యాసింజర్‌కు రూ.60 చొప్పున కట్‌ అవుతుంది. దీనిపై అదనంగా జీఎస్టీ  ఉంటుంది’ అని తెలియజేసింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా కాకుండా చాలామంది థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా టికెట్‌లు బుక్ చేస్తున్నారు. దాంతో టికెట్‌ కన్ఫర్మ్‌ అవ్వకపోతే యాప్‌ కూడా అదనంగా ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: 60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..

క్యాన్సిలేషన్‌ ఛార్జీలు ఇలా..

> టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యాక ప్రయాణం వాయిదా వేయాలనుకుని టికెట్‌ క్యాన్సిల్‌ చేయాలనుకుంటే మాత్రం వివిధ తరగతులకు విభిన్నంగా ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రయాణానికి 48 గంటల మందే క్యాన్సిల్‌ చేస్తే కింది ఛార్జీలు విధిస్తారు.

  • ఏసీ ఫస్ట్/ ఎగ్జిక్యూటివ్: రూ.240 + GST

  • ఫస్ట్ క్లాస్/ ఏసీ 2 టైర్: రూ.200 + GST

  • ఏసీ చైర్ కార్/ ఏసీ 3 టైర్/ఏసీ 3 ఎకానమీ: రూ.180 + GST

  • స్లీపర్: రూ.120

  • సెకండ్‌ క్లాస్‌: రూ.60

> ట్రెయిన్‌ బయలుదేరే 48 నుంచి 12 గంటల మధ్య టికెట్‌ క్యాన్సిల్‌ చేయాలంటే ఛార్జీలో 25 శాతం, జీఎస్టీ భరించాల్సిందే.

> ప్రయాణానికి 12 నుంచి 4 గంటలలోపు అయితే ఛార్జీలో 50 శాతం, జీఎస్టీ విధిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement