భారత స్టాక్ మార్కెట్లో ఈరోజు (జులై 06, 2026) ర్యాలీ చోటుచేసుకుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి తోడు అంతర్జాతీయ సానుకూల సంకేతాలు తోడవడంతో మార్కెట్లు దూసుకుపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 24,430 వద్దకు, సెన్సెక్స్ 521 పాయింట్లు పెరిగి 78,285 వద్దకు చేరడం మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ను స్పష్టం చేస్తోంది.
ర్యాలీకి దారితీసిన ప్రధాన కారణాలు
మధ్యప్రాచ్యంలో సడలిన ఉద్రిక్తతలు: గత వారం ఇరాన్ వేదికగా చోటుచేసుకున్న పరిణామాల తర్వాత భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. యూఎస్-ఇరాన్ చర్చలలో పురోగతి, యుద్ధ మేఘాలు తొలగిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచింది.
యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలు: అమెరికాలో ఇటీవల విడుదలైన ఉపాధి గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా నమోదు కావడంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపుతుందనే ఆశలు పెరిగాయి. ఇది అంతర్జాతీయంగా రిస్క్ అసెట్స్ అయిన ఈక్విటీ మార్కెట్లలోకి నిధులు వచ్చేలా చేసింది.
ఆసియా, ఐరోపా మార్కెట్ల మద్దతు: యూరోజోన్లో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గడం, ఆసియా మార్కెట్లలో (హాంకాంగ్, షాంఘై) ఐటీ, టెక్ షేర్లలో కొనుగోళ్లు పెరగడం భారత మార్కెట్లకు సానుకూలంగా మారింది.
చమురు ధరల పతనం
ఇరాన్ సంక్షోభం సడలడం, ఒప్పందం ప్రకారం ఓపెక్ ప్లస్ దేశాలు చమురు సరఫరాను పెంచేందుకు అంగీకరించడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 71.50 డాలర్ల దిగువకు పడిపోయింది. చమురు ధరలు తగ్గడం వల్ల భారత్ దిగుమతి బిల్లు భారం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి, కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పెరగడానికి (ముఖ్యంగా ఆటోమొబైల్, పెయింట్స్, ఏవియేషన్ రంగాలకు) ఎంతగానో దోహదపడుతుంది.
సంస్థాగత పెట్టుబడులు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మళ్లీ భారత మార్కెట్ల వైపు మళ్లారు. గత శుక్రవారం దాదాపు రూ.1,355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా ఈరోజు కూడా కొనుగోళ్ల జోరు కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్కు బలాన్నిస్తున్నారు. జూన్ త్రైమాసిక కార్పొరేట్ ఆదాయాల సీజన్ ప్రారంభం కానుండటంతో కంపెనీల బిజినెస్ అప్డేట్స్ సానుకూలంగా వస్తున్నాయి.
రూపాయి స్థిరత్వం
డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ కొంత బలహీనపడటం, చమురు ధరలు దిగిరావడంతో రూపాయిపై ఒత్తిడి తగ్గింది. రూపాయి బలోపేతం కావడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు భారత ఈక్విటీలపై నమ్మకం పెరిగి మరింత పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
ఇదీ చదవండి: కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి!


