
డబ్ల్యూఈఎఫ్ మాజీ ఎండీ క్లౌడే స్మద్జా
భారత్ జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నందుకు సంతృప్తి చెందొద్దని.. తలసరి ఆదాయం పరంగా జపాన్తో పోల్చి చూస్తే భారత్ ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) మాజీ ఎండీ క్లౌడే స్మద్జా వ్యాఖ్యానించారు.
ఐఎంఎఫ్ 2025 ఏప్రిల్ డేటా ప్రకారం భారత్లో తలసరి ఆదాయం 2,878 డాలర్లు. జపాన్ తలసరి ఆదాయం 33,956 డాలర్లలో పోల్చి చూస్తే కేవలం 8.5 శాతమే కావడం గమనార్హం. భారత్ తలసరి ఆదాయం కంటే జపాన్లో తలసరి ఆదాయం 11.8 రెట్లు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘భారత్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి చేరుకోవడం సాధించిన ప్రగతికి సంబంధించి మంచి సంకేతమే. కానీ, ఈ విషయంలో సంతృప్తి చెందడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలు
ఆర్థికంగా భారత్ కొత్త స్థానానికి చేరుకోవడం అన్నది.. సంస్కరణలను వేగవంతం చేయడానికి.. అభివృద్ధి ఫలాలు కేవలం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి వర్గాలకే పరిమితం కాకుండా పౌరులు అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు ప్రేరణ కావాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా సాంకేతిక పోటీలో భారత్ కీలకమైన కూడలిలో ఉన్నట్టు తెలియజేస్తూ.. బిగ్ డేటా పరంగా ఆధిక్యత ప్రదర్శిస్తున్నట్టు స్మద్జా తెలిపారు. ఈ స్థానాన్ని తప్పకుండా కాపాడుకోవడంతోపాటు.. అంతర్జాతీయంగా టెక్నాలజీ, ఆవిష్కరణల్లో అగ్రస్థానానికి చేరుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.