ఆర్థిక వ్యవస్థలో నెలకుంటున్న అనిశ్చితి, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, నానాటికీ పెరుగుతున్న జీవన వ్యయాలు.. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు ఎవరైనా సరే ఆచితూచి ఖర్చు చేస్తారు. కానీ, భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో మాత్రం ఇందుకు భిన్నమైన వైరుధ్యం కనిపిస్తోంది.
ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇళ్ల ధరలు మరింత ఆకాశాన్ని తాకుతాయనే భయంతో, కొనుగోలుదారులు ఇప్పుడే బడ్జెట్ను పెంచుకుని మరీ లగ్జరీ గృహాల వైపు చూస్తున్నారు.ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఆర్థిక జాగ్రత్త కంటే, భవిష్యత్తులో ఇల్లు కొనలేమేమోననే భయం, మెరుగైన జీవనశైలి అనే అంశాలే రియల్టీ రంగాన్ని నడిపిస్తున్నాయి.
ఖర్చుల భారం
ప్రస్తుతం ఎగుమతి, దిగుమతుల రంగంలో ఉన్న అంతరాయాలు నిర్మాణ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, షిప్పింగ్ రీరూటింగ్, గల్ఫ్ లింక్డ్ కార్గోలపై విధిస్తున్న యుద్ధ-ప్రమాద బీమా భారం లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనారాక్ (ANAROCK) తాజా నివేదిక ప్రకారం నిర్మాణ రంగంలో పెరిగిన ఖర్చులు ఇలా ఉన్నాయి..
కంటైనర్ రవాణా ఖర్చులు: సరుకు రవాణా ఛార్జీలు, రీరూటింగ్ కారణంగా కంటైనర్కు అదనంగా రూ.2 లక్షల నుండి రూ.3.5 లక్షల వరకు భారం పెరిగింది.
ఉక్కు ధరలు: గడిచిన కాలంలో స్టీల్ ధరలు టన్నుకు ఏకంగా 20% పెరిగి దాదాపు రూ.72,000కు చేరుకున్నాయి.
దిగుమతులపై ప్రభావం: ముంబై, గురుగ్రామ్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని లగ్జరీ టవర్లలో వాడే ప్రీమియం ఫిట్టింగ్స్, విదేశీ మార్బుల్స్, ప్రత్యేక నిర్మాణ సామాగ్రి ధరలు రవాణా అంతరాయాల వల్ల భారీగా పెరిగాయి.
"ఇప్పుడు కొనకపోతే భవిష్యత్తులో ఈ ధరలు మన బడ్జెట్కు అందనంత ఎత్తుకు వెళ్లిపోతాయి" అనే ఆలోచనే వినియోగదారులను ముందడుగు వేసేలా చేస్తోంది.
మారిన కొనుగోలుదారుల ఆలోచన
ఒకప్పుడు కేవలం పెట్టుబడి కోసమే ఇళ్లను కొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ద్వంద్వ ఆదాయం (భార్యాభర్తలిద్దరూ సంపాదించే) కలిగిన పట్టణ కుటుంబాలు, ఎగువ మధ్యతరగతి వర్గాలు గృహాన్ని తమ సామాజిక హోదాకు, ఆర్థిక భద్రతకు నిదర్శనంగా భావిస్తున్నారు.
ముంబై, బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్ నగరాల్లో కొనుగోలుదారులు కేవలం నాలుగు గోడల ఇల్లు కాకుండా విస్తారమైన పెద్ద గృహాలు, వెల్నెస్-ఫోకస్డ్, గ్రీన్ ప్రాజెక్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆధునిక జీవనశైలి వసతులు ఉన్న వాటికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
బ్రాండెడ్ బిల్డర్లకే జై!
గతంలో ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోవడం, డెలివరీ ఆలస్యం కావడం వంటి చేదు అనుభవాల దృష్ట్యా కొనుగోలుదారులు ఇప్పుడు చాలా అప్రమత్తమయ్యారు. ధర కొంచెం ఎక్కువైనా సరే, నమ్మకమైన కార్పొరేట్ బ్రాండ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీనినే మార్కెట్ వర్గాలు 'ట్రస్ట్ ప్రీమియం' అని పిలుస్తున్నాయి.
వినియోగదారులు, ల్యాండ్ ఓనర్లు ఇప్పుడు డెవలపర్ల ఆర్థిక క్రమశిక్షణ, బ్యాలెన్స్ షీట్ బలం, గత ట్రాక్ రికార్డ్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. డీఎల్ఎఫ్, ఎంబసీ డెవలప్మెంట్స్, సిగ్నేచర్ గ్లోబల్ వంటి దిగ్గజ సంస్థల విక్రయాలు పుంజుకోవడానికి ఈ బ్రాండ్ ఇమేజ్, విశ్వసనీయతే ప్రధాన కారణం.
ప్రీమియం వర్సెస్ అఫోర్డబుల్
భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. ఒకవైపు లగ్జరీ ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంటే, మరోవైపు అందుబాటు గృహాల (Affordable Housing) అమ్మకాలు మందగించాయి. డీఎల్ఎఫ్ (డహ్లియాస్ ప్రాజెక్ట్) కేవలం ఒకే ఒక్క త్రైమాసికంలో 32 లగ్జరీ అపార్ట్మెంట్లను విక్రయించింది. ఎంబసీ డెవలప్మెంట్స్ దక్షిణ ముంబై లగ్జరీ ప్రాజెక్ట్ ప్రారంభించిన 45 రోజుల్లోనే రూ.800 కోట్ల ప్రీ-సేల్స్ సాధించింది. మార్కెట్ ట్రెండ్ ప్రీమియం వైపు మళ్లడంతో మహీంద్రా లైఫ్స్పేసెస్ వంటి పెద్ద కంపెనీలు తమ సరసమైన హౌసింగ్ ప్రాజెక్టుల విస్తరణను తగ్గించుకోవడం గమనార్హం.


