ఫలితాలు, విదేశీ అంశాలపై కన్ను | India-Pak tensions, global cues among key triggers for Indian stock market | Sakshi
Sakshi News home page

ఫలితాలు, విదేశీ అంశాలపై కన్ను

Apr 28 2025 6:15 AM | Updated on Apr 28 2025 6:15 AM

India-Pak tensions, global cues among key triggers for Indian stock market

భారత్, పాకిస్తాన్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌

గురువారం మహారాష్ట్ర డే సెలవు 

ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం 

కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు కీలకం

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్తాన్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రభావం చూపనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక ఆందోళనలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు ప్రస్తావించారు. 

ఇవికాకుండా అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల సంక్షోభానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గత వారం చివర్లో మార్కెట్లు ఉన్నట్టుండి బలహీనపడ్డాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ  23,800కు ఎగువన నిలవగలిగితేనే సాంకేతికంగా బుల్లిష్‌ ధోరణి కొనసాగే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మహారాష్ట్ర డే సందర్భంగా గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు.  

ఇంధన, సిమెంట్‌ కంపెనీలు 
ఇప్పటికే గత ఆర్థిక సంవత్సర(2024–25) ఫలితాల సీజన్‌ ప్రారంభమై జోరందుకుంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని దిగ్గజాలు క్యూ4(జనవరి–మార్చి) పనితీరుతోపాటు పూర్తి ఏడాది ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఇంధన రంగ పీఎస్‌యూలు ఇండిఆయన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌)సహా.. సిమెంట్‌ దిగ్గజాలు అంబుజా, అల్ట్రాటెక్, టాటా గ్రూప్‌ దిగ్గజం ట్రెంట్, ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్‌ మోటార్, బజాజ్‌ ఫైనాన్స్‌ తదిరాలున్నాయి. గత వారం చివర్లో డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్యూ4, పూర్తి ఏడాది ఫలితాలు వెలువరించింది. ఈ ప్రభావం నేటి(సోమవారం) ట్రేడింగ్‌లో రిలయన్స్‌ కౌంటర్‌పై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ఇతర అంశాలు 
గత వారం ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ వెనకడుగు వేసింది. మరోవైపు దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు భారీగా ఇన్వెస్ట్‌ చేశారు. వెరసి డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి బలపడింది. అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల సంక్షోభం కారణంగా పసిడి ధరలు మండుతున్నప్పటికీ ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. బ్రెంట్‌ చమురు 65 డాలర్ల సమీపంలో కదులుతోంది. రూపాయి పుంజుకోవడం, చమురు చల్లబడటం దేశీ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

 ఈ వారం భారత్, పాకిస్తాన్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, అంతర్జాతీయ టారిఫ్‌ల సంక్షోభం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. ఇవికాకుండా దేశీయంగా పలు కార్పొరేట్‌ దిగ్గజాలు క్యూ4 ఫలితాలు ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి పెట్టనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. మరోవైపు ఎఫ్‌పీఐలు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం సానుకూల అంశమని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయకుమార్‌ పేర్కొన్నారు.  

సానుకూలం
2024 అక్టోబర్‌ మొదలు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల ఉపసంహరణకే పెద్దపీట వేస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం! దీంతో గత 7 ట్రేడింగ్‌ రోజుల్లో ఎఫ్‌పీఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 27649 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. గత వారం రూ. 17,425 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఫలితంగా భారత్, పాక్‌ ఉద్రిక్తతల నడుమ చివరి రెండు రోజుల్లో మార్కెట్లు నీరసించినప్పటికీ నికరంగా గత వారం లాభపడ్డాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 659 పాయింట్లు(0.84 శాతం) పుంజుకుని 79,213 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 188 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 24,039 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ మరింత అధికంగా 1.3 శాతం బలపడగా, స్మాల్‌క్యాప్‌ 0.12 శాతమే లాభపడింది.

ఐఐపీవైపు చూపుమార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి
(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి గత 6 నెలల్లోనే కనిష్టంగా 2.9 శాతానికి పరిమితమైంది. జనవరిలో నమోదైన 5.2 శాతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. ఇక ఏప్రిల్‌ నెలకు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ పీఎంఐ వారాంతాన(మే 2న) విడుదలకానుంది. అంతర్జాతీయ అంశాల విషయానికివస్తే మార్చి నెలకు 29న యూఎస్‌ ఉపాధి గణాంకాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌కు చైనా తయారీ పీఎంఐ గణాంకాలు, ఏప్రిల్‌కు యూఎస్‌ పీసీఈ ధరల ఇండెక్స్‌ 30న వెలువడనున్నాయి. మే 1న బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు, రిటైల్‌ ధరలు ప్రకటితంకానున్నాయి. ఈ బాటలో యూఎస్‌ తయారీ పీఎంఐ, వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు 2న వెల్లడికానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement