మణిపాల్ సిగ్నా ఇండియా హెల్త్ కోషంట్లో వెల్లడి
అన్నింటికంటే వెనుకబడిన ఆర్థిక ఆరోగ్యం
ముంబై: దేశీయంగా ప్రజలు తమ శారీరక, మానసిక, ఆర్థిక ఆరోగ్యంతో పాటు ఉద్యోగాలు, బంధాలు మొదలైన వాటన్నింటినీ సమన్వయం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శారీరక, మానసిక, ఆర్థిక, వృత్తి, సామాజికం అనే ఐదు అంశాలపై మణిపాల్ సిగ్నా ఇండియా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకు సంబంధించిన హెల్త్ కోషంట్ 2026లో ప్రజల సమగ్ర ఆరోగ్య స్కోరు 100కి గాను 65గా నమోదైనట్లు సంస్థ వెల్లడించింది. శారీరక ఆరోగ్యం అత్యధికంగా 68 స్కోరు సాధించగా, ఆర్థిక ఆరోగ్యం 62 స్కోరుతో అన్నింటికంటే వెనుకబడింది.
పట్టణ ప్రాంత భారతీయుల్లో 82 శాతం మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, కేవలం ఒక శాతం మంది మాత్రమే తమ ఆరోగ్యం బాగోలేదని అభిప్రాయపడ్డారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేథ వాడకంపై 63 శాతం మంది సానుకూలంగా ఉన్నప్పటికీ, అది వైద్యులకు సహాయకారిగా ఉండాలే తప్ప మానవ మేథస్సు స్థానాన్ని ఆక్రమించేదిగా ఉండకూడదని చెప్పారు. ప్రజలు చికిత్స ఎలా అందుతుందని ఆందోళన చెందడం కాకుండా తాము ఆరోగ్యంగా ఎలా ఉండాలనే దానిపై దృష్టి పెడుతున్నారని సంస్థ ఎండీ జాయ్దీప్ సాహా తెలిపారు.


